న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 107 మంది ఎమ్మెల్యేలు, ఎంపిలపై ద్వేషపూరిత ప్రసంగాల కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) నివేదిక వెల్లడించింది. విద్వేష ప్రసంగాల్లో బిజెపి ప్రజాప్రతినిధులే అత్యధికులున్నారని పేర్కొంది. మంగళవారం ఈమేరకు నివేదికను విడుదల చేసింది. ఇటువంటి కేసులు ఉన్న 480 మంది గత ఐదేళ్లలో రాష్ట్ర అసెంబ్లీలతోపాటు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినట్లు తెలిపింది. ఎడిఆర్తో పాటు నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఇడబ్ల్యు) సంయుక్తంగా ఈ సర్వే చేపట్టినట్లు తెలిపాయి. ఎంపిలు, ఎమ్మెల్యేలతోపాటు ఆ సమయంలో జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు స్వయంగా దాఖలు చేసిన అఫిడవిట్లను అధ్యయనం చేసినట్లు పేర్కొన్నాయి. తమపై విద్వేష ప్రసంగాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపిలు స్వయంగా పేర్కొన్నట్లు సర్వే తెలిపింది.
నివేదిక ప్రకారం.. యుపి (ఏడుగురు), తమిళనాడు (నలుగురు), బీహార్, కర్ణాటక, తెలంగాణల నుంచి ముగ్గురు చొప్పున, అస్సాం, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ నుంచి ఇద్దరు చొప్పున, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్ల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 33 మంది ఎంపిలపై కేసులు ఉన్నాయి. వీరిలో 22 మంది బిజెపికి, కాంగ్రెస్ (ఇద్దరు), ఆప్, ఎఐఎంఐఎం, ఎఐయుడిఎఫ్, డిఎంకె, ఎండిఎంకె, పిఎంకె, శివసేన (ఉద్ధవ్ థాకరే), విసికె పార్టీల నుండి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఓ స్వతంత్ర ఎంపిపై కూడా ఈ కేసు ఉన్నట్లు నివేదిక తెలిపింది.
బీహార్, ఉత్తర ప్రదేశ్ల నుంచి తొమ్మిది మంది చొప్పున, ఎపి, మహారాష్ట్ర, తెలంగాణల నుంచి ఆరుగురు చొప్పున, అస్సాం, తమిళనాడు నుంచి ఐదుగురు చొప్పున, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమబెంగాల్ నుంచి నలుగురు చొప్పున, జార్ఖండ్, ఉత్తరాఖండ్ల నుంచి ముగ్గురు చొప్పున, కర్ణాటక, పంజాబ్, రాజస్తాన్ల నుంచి ఇద్దరు చొప్పున, త్రిపుర, మధ్యప్రదేశ్, ఒడిశాల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 74 మంది ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయి. ఈ జాబితాలో బిజెపికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్ నుంచి 13 మంది, ఆప్ నుంచి ఆరుగురు ఉన్నారు.










