May 27,2023 22:01

ముంబై : డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ వరుసగా రెండోసారి ఫైనల్‌ చేరింది. తమ జట్టు ఫైనల్‌ చేరడంతో పేసర్‌ జోష్‌ లిటిల్‌ పట్టలేనంత సంతోషంతో ఉన్నాడు. అతను అంతగా సంబురపడడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే..? ఐపీఎల్‌ ఫైనల్‌ ఆడాలన్న లిటిల్‌ కల నిజమైంది. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. 'ఎప్పటికైనా ఐపీఎల్‌ జట్టుకి ఎంపికవ్వాలి.. ఫైనల్‌ ఆడాలన్నది నా డ్రీమ్‌. నేను అనుకున్నది నిజమైంది. ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది. దాంతో నేను ఎంతో సంతోషంతో ఉన్నా' అని లిటిల్‌ తెలిపాడు.ముంబై ఇండియన్స్‌పై క్వాలిఫైయర్‌ 2లో విజయంపై ఈ ఐర్లాండ్‌ బౌలర్‌ .. 'మరో టైటిల్‌ కోసం పోటీపడుతున్నాం' అని స్పందించాడు. ముంబైపై లిటిల్‌ అద్భుతంగా రాణించాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన అతను డేంజరస్‌ కామెరూన్‌ గ్రీన్‌(30)ను బౌల్డ్‌ చేసి గుజరాత్‌ను పోటీలోకి తెచ్చాడు. ఇప్పటివరకు 7 మ్యాచుల్లో అతను 7 వికెట్లు తీశాడు.
శుభ్‌మన్‌ గిల్‌ శతకమోత
క్వాలిఫైయర్‌ 2 పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ అదరగొట్టింది. ఆల్‌రౌండ్‌ షోతో ముంబై ఇండియన్స్‌పై 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(129: 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లు) సెంచరీ బాదడంతో మొదట గుజరాత్‌ 2 వికెట్ల నష్టానికి 233 రన్స్‌ చేసింది. లక్ష్య ఛేదనలో సూర్యకుమార్‌ యాదవ్‌(55) ఒక్కడే పోరాడాడు. అయితే.. సీనియర్‌ పేసర్‌ మోహిత్‌ శర్మ 5 వికెట్లు తీయడంతో ముంబై 171కు ఆలౌటయ్యింది. దాంతో గుజరాత్‌ ఆదివారం (మే 28న) చెన్నై సూపర్‌ కింగ్స్‌తో టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది.