Oct 04,2023 11:28

విజయవాడ : టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్లపై కాసేపట్లో విజయవాడ ఎసిబి కోర్టులో విచారణ జరగనుంది. బుధవారం ఉదయం చంద్రబాబు తరపు న్యాయవాది దూబే కోర్టుకు చేరుకున్నారు. బెయిల్‌, కస్టడీ పిటిషన్లతో పాటు సిఐడి దాఖలు చేసిన ఫైబర్‌ నెట్‌, ఐఆర్‌ఆర్‌ (రింగ్‌రోడ్డు కేసు) పీటీ వారెంట్ల పైనా ఎసిబి కోర్టు విచారణ చేపట్టనుంది. మొదటగా చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. ఈలోగా.. చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలను నోట్‌ చేసుకోవాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులకు జడ్జి సూచించారు. అయితే.. రెగ్యులర్‌ కాల్స్‌ అటెండ్‌ చేసి వాదనలు వింటానని ఎసిబి జడ్జి తెలిపారు. చాలా పిటిషన్లు పెండింగులో ఉన్నాయని, వాదనలకు ఎక్కువ సమయం పడుతుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు తెలిపారు. తమ తరపున సీనియర్‌ న్యాయవాదులు రావాల్సి ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాదులు చెప్పారు. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వినాల్సిందిగా ఎసిబి న్యాయస్ధానాన్ని చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్‌ కుమార్‌ దూబే కోరారు. ఆ రెండు పిటిషన్లతో పాటు పీటీ వారెంట్లపైనా కాసేపట్లో కోర్టులో వాదోపవాదాలు జరగనున్నాయి.