Oct 17,2023 10:27
  • 24గంటల్లో నీరు, విద్యుత్‌ నిల్వలు ఖాళీ
  • ఆస్పత్రుల్లో పరిస్థితులు దయనీయం
  • పొంచివున్న ఇన్ఫెక్లన్లు, అంటువ్యాధులు
  • సాయం కోసం ప్రజల ఎదురుతెన్నులు
  • రాఫా క్రాసింగ్‌ వద్ద పడివున్న ఆహార నిల్వలు
  • ఒప్పందం కోసం ముమ్మరంగా దౌత్య ప్రయత్నాలు

జెరూసలేం, గాజా : హమాస్‌ ఆధీనంలో వున్న గాజాపై ఇజ్రాయిల్‌ బాంబు దాడులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు నీరు, విద్యుత్‌ నిల్వలు తరిగిపోతుండడంతో గాజా ప్రజలు ఉక్కిరిబిక్కిరవు తున్నారు. సాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. పలు దేశాల నుండి వచ్చిన వందలాది మెట్రిక్‌ టన్నుల ఆహారం, ఇతర సాయం ఈజిప్ట్‌లోని సినారు ద్వీపకల్పంలో రోజుల తరబడి నిలిచిపోయింది. బాంబుల మోత మోగుతున్న గాజాకు సురక్షితంగా చేరవేయడం పెద్ద సాహసకృత్యంగా మారింది. గాజాకు సాయం అందించడం, విదేశీ పాస్‌పోర్టు గల వారందరినీ రాఫా క్రాసింగ్‌ ద్వారా తరలించడానికి ఒప్పందం కుదిరేవరకు ఈ సాయం ఆగిపోయింది. బాధితులకు సాయమందించడం కోసం దౌత్య ప్రయత్నాలు ఉధృతమయ్యాయి. ఈ తరుణంలో గాజాతో గల సరిహద్దును ఈజిప్ట్‌ తెరుస్తుందని భావిస్తున్నారు. ప్రాణాధారమైన సాయం రాఫా క్రాసింగ్‌ వద్ద ఎదురుచూస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) పేర్కొంది. వైద్య సరఫరాలు, ఇంధనం, పరిశుభ్రమైన నీరు, ఆహారం, ఇతర మానవతా సాయాన్ని రాఫా క్రాసింగ్‌ ద్వారా గాజాకు వెళ్లేందుకు అనుమతించాలంటూ డబ్ల్యుహెచ్‌ఒ ఇప్పటికే పలు విజ్ఞప్తులు చేసింది. మరోవైపు గాజావ్యాప్తంగా అస్పత్రిల్లో ఇంధన నిల్వలు తరిగిపోతున్నాయి. మరో 24గంటలు మాత్రమే వస్తాయని భావిస్తున్నారు. దీంతో వేలాదిమంది రోగుల ప్రాణాలు ముప్పు బారిన పడనున్నాయని ఐక్యరాజ్య సమితి మానవతా కార్యకలాపాల కార్యాలయం (ఒసిహెచ్‌ఎ) సోమవారం తెలిపింది. గాజాలో పరిమిత నీటి నిల్వలు మాత్రమే వుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే పారిశుధ్యం కూడా దారుణంగా వుందని, ముఖ్యంగా ఆస్పత్రుల్లో పరిస్థితి ఘోరంగా వుందని, దీనివల్ల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు చెలరేగే ప్రమాదముందని ఆందోళన వెలిబుచ్చింది. ఆరోగ్య సంక్షోభం తలెత్తిన పక్షంలో వెంటనే స్పందించేందుకు వీలుగా లెబనాన్‌కు కీలకమైన వైద్య సరఫరాలను పంపించడాన్ని వేగిరపరిచినట్లు తెలిపింది. 'నీరు, విద్యుత్‌ లేక గాజా ఉక్కిరిబిక్కిరి అవుతోంది, ప్రస్తుత తరుణంలో ప్రపంచం తన మావనత్వాన్ని మరిచిపోయినట్లు కనిపిస్తోంది.' అని ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా శరణార్దుల కమిషనర్‌ (యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ) జనరల్‌ ఫిలిప్‌ లాజారిని వ్యాఖ్యానించారు.
            వైమానిక దాడుల వల్ల రాఫా క్రాసింగ్‌ను మూసివేశారు. ఒప్పందానికి అమెరికా మధ్యవర్తిత్వం నెరపడం కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ దాడుల్లో గాజాలో 2,670మంది చనిపోయారని అధికారులు తెలిపారు. వీరిలో నాల్గోవంతు మంది చిన్నారులే, మరో 10వేల మంది గాయపడ్డారు. ఇంకో వెయ్యిమంది గల్లంతయ్యారు. వీరు శిథిలాల కింద చిక్కుకుని వుంటారని భయపడుతున్నారు.
 

                                                                          కాల్పుల విరమణ లేదు

రాఫా సరిహద్దు క్రాసింగ్‌కు అనుమతించేందుకు గాజాలో కాల్పుల విరమణ జరిగిందని వచ్చిన వార్తలను ఇజ్రాయిల్‌ తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రధాని బెంజామిన్‌ నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటన చేస్తూ, 'గాజాకు సాయమందేందుకు, విదేశీయులను తరలించేందుకు ప్రస్తుత తరుణంలో ఎలాంటి కాల్పుల విరమణ లేదు' అని స్పష్టం చేసింది. అంతకుముందు రాఫా తెరిచేందుకు ఒప్పందం కుదిరిందంటూ ఈజిప్ట్‌ భద్రతా వర్గాలు తెలిపాయని వార్తలు వెలువడ్డాయి.
             దక్షిణ గాజాలో కాల్పుల విరమణకు ఈజిప్ట్‌, అమెరికా, ఇజ్రాయిల్‌ అంగీకరించాయని ఆ వార్తలు తెలిపాయి. పలు గంటల పాటు ఈ కాల్పుల విరమణ వుండవచ్చని, కానీ కచ్చితంగా ఎప్పుడు ప్రారంభమయ్యేది తెలియదని పేర్కొన్నాయి.
 

                                                                 హమాస్‌ చెరలో 199 మంది బందీలు

హమాస్‌ అదుపులోకి తీసుకున్న వారు 199మంది వున్నారని ఇజ్రాయిల్‌ మిలటరీ సోమవారం స్పష్టం చేసింది. ఆ 199 బందీల కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచా రాన్ని చేరవేస్తున్నామని సైనిక ప్రతినిధి డేనియల్‌ హగారి మీడియాకు తెలిపారు. అంతకుముందు 155 మంది బందీలని ప్రకటించింది. ఇజ్రాయిలీలతోపాటూ విదేశీయులు కూడా బందీల్లో వున్నారు. తక్షణమే బందీలను విడిచిపెట్టి గాజాకు మానవతా సాయాన్ని అందేలా చూడాల్సిందిగా యుఎన్‌ చీఫ్‌ విజ్ఞప్తి చేశారు. అరబ్‌ లీగ్‌ చీఫ్‌ కూడా ఇదే విజ్ఞప్తి చేశారు.