Jun 16,2023 06:55

అటవీ చట్టానికి తెచ్చిన సవరణతో అటవీ ప్రాంతాల్లో కార్పొరేట్లు యథేచ్ఛగా ఏ ప్రాజెక్టునైనా గ్రామ సభల ఆమోదం లేకుండా చేపట్టవచ్చు. 1980 అటవీ చట్టంలో అటవీ భూములను ఇతర అవసరాల కోసం విద్యుత్‌ ప్రాజెక్టులు, మైనింగ్‌, బాక్సైట్‌ తవ్వకాలు లాంటివి గ్రామ సభలు లేకుండా చేపట్టటం కుదరదు. గ్రామ సభల ఆమోదం తప్పనిసరి. ఇప్పుడు ఈ తాజా చట్ట సవరణ ద్వారా గ్రామసభల అవసరాన్ని రద్దు చేస్తోంది. అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లు అడవుల్లో యథేచ్ఛగా ప్రాజెక్టుల పేరుతో ప్రవేశిస్తే గిరిజనులు తమ భూముల్నుండి గెంటి వేయబడతారు.

డవుల పరిరక్షణ చట్టం-1980కి బిజెపి ప్రభుత్వం 2023 మార్చి 29న సవరణ ప్రతిపాదించింది. ఇది అమలైతే అడవుల రక్షణే కాదు, గిరిజనుల మనుగడే ప్రమాదంలో పడుతుంది. అటవీ భూములను ఆఖరుకి గిరిజనుల స్వాధీనంలో వున్న భూములను ఇతర అవసరాల కోసమని (విద్యుత్‌ ప్రాజెక్టులు, మైనింగ్‌, పర్యాటకం పేరుతో) ప్రాజెక్టులకు మళ్లించడానికి వీలు కల్పించారు.
 

                                                                 అడవులపై చట్టాలు - చరిత్ర

బ్రిటీషువారు మొదట 1865 లోనే అడవులపై చట్టం తెచ్చారు. ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఏర్పడింది. దీన్ని మరింత కఠినతరం చేస్తూ 1878లో మరో చట్టం చేశారు. పై రెండు చట్టాలను, ఇతర కొన్ని కొత్త నిబంధనలను చేర్చి కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలతో 1927లో మరో చట్టం చేశారు. తద్వారా ప్రభుత్వానికి అడవులపై హక్కులు దఖలు పరిచారు. 1927లో రూపొందిన అటవీ చట్టం అడవులలో నివశించే గిరిజనుల జీవనం, వారి హక్కుల గురించి ఒక్క మాట పేర్కొనలేదు. వారి ఇళ్లకు, భూములకు, ఇతర అటవీ ఉప ఉత్పత్తుల మీద హక్కులకు ఈ చట్టంలో చట్టపరమైన హక్కులు గుర్తించలేదు. పైగా ఈ చట్టం ద్వారా రూపొందిన విధానాలు అడవుల్లో కలప సేకరణపై ప్రభుత్వానికి ప్రత్యేక హక్కులు కల్పించబడ్డాయి. కలప తరలింపుపై అనేక నిబంధనలు రూపొందించారు. అడవి, కలప, ఉప ఉత్పత్తులు మొదలగునవి పరిశ్రమల అభివృద్ధికి, పరిసరాల్లోని ప్రజల జీవనానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆ రోజుల్లో బ్రిటీషు ప్రభుత్వం అంతకు ముందు చట్టాల కంటే మరింత పకడ్బందీగా అటవీ ఉత్పత్తులను కంట్రోల్‌ చేసే చట్టంగా ఇది రూపొందింది.
            మొట్టమొదటి చట్టంలో (1865) అటవీ భూములన్నీ ప్రభుత్వ స్వాధీనం అయితే, 1927 చట్టంలో అడవుల్లో ఉత్పత్తి అయ్యే కలప ఇతర ఉత్పత్తులు అన్నీ బ్రిటీషు ప్రభుత్వ కంట్రోల్లోకి తేబడ్డాయి. ఈ కలపతోనే బ్రిటీషు ప్రభుత్వం ఇంగ్లండ్‌లో ఓడల నిర్మాణం చేపట్టింది. రైల్వే స్లీపర్లు (దుంగలు కొయ్యలతో) రైలు పట్టాలు నిర్మించింది. తమ వ్యాపారానికి రైల్వే లైన్లు, ఓడలు అవసరం అయిన తరుణంలో అడవుల సంపదపై పూర్తి పట్టు సాధించిన చట్టంగా 1927 చట్టం అమలులోకి వచ్చింది. ఈ కాలంలోనే మన అడవులు భారీ స్థాయిలో ధ్వంసం అయ్యాయి. బ్రిటీషు ప్రభుత్వం ఈ చట్టం ద్వారా అటవీ ప్రాంతాన్ని ఒక మంచి ఆదాయ వనరుగా రూపొందించింది. 1865 చట్టం బ్రిటీషు ప్రభుత్వానికి దట్టంగా చెట్లున్న ప్రాంతాన్ని అడవిగా ప్రకటించే అధికారం ఇస్తే, 1927 చట్టం అటవీ సంపద వలస రాజ్యం పూర్తిగా కొల్లగొట్టేదానికి అవకాశం ఇచ్చింది. భూముల్లో ప్రవేశించినా, కలపను తరలించినా అపరాధపు పన్ను వసూలుకు, చివరకు జైలు శిక్షలు విధించడానికి ఈ చట్టం బ్రిటీషు ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. మిలియన్ల కొద్దీ ప్రజలు అడవులలోనూ, అటవీ పరిసరాలలోనూ నివశిస్తున్నా వారికి ఏ విధమైన చట్టబద్ధమైన హక్కులు లేకుండా పోయాయి. 1880 జనాభా లెక్కల ప్రకారం గిరిజనుల జనాభా 70 మిలియన్లని (7 కోట్లు) అంచనా వేయబడింది. కానీ అటవీ అధికారులకు అటు అడవుల మీద, ఇటు అడవులలో నివశించే గిరిజనుల మీద మితిమీరిన అధికారాలు దఖలు పర్చబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం 2023 చట్ట సవరణ ద్వారా 1927 చట్టం లాంటి విధానాల వైపు పరుగులు పెడుతోంది.
              బ్రిటీషు ప్రభుత్వం అటవీ ప్రాంతాల్లో పాలనా యంత్రాగాన్ని వినియోగించి అడవులపై ఆధారపడిన గిరిజనుల కమ్యూనిటీల మీద, వారి జీవనంపైన విపరీతమైన ఆంక్షలు విధించింది. ఆహారం, వంట చెరుకు, మందులు, ఉప ఉత్పత్తుల వినియోగానికి ఈ ఆంక్షలు పెట్టారు. వాస్తవంగా అడవులలో నివశించే గిరిజనుల, వారి కమ్యూనిటీల విధానాలతోనే అభివృద్ధి చెందుతూ వచ్చిన అడవుల పరిరక్షణ పరిణామాన్ని బ్రిటీషు చట్టాలు దెబ్బకొట్టాయి.
 

                                                                       తాజా సవరణ చట్టం

ఇప్పుడు 2023 మార్చి 29న అటవీ చట్టానికి తెచ్చిన సవరణతో అటవీ ప్రాంతాల్లో కార్పొరేట్లు యథేచ్ఛగా ఏ ప్రాజెక్టునైనా గ్రామ సభల ఆమోదం లేకుండా చేపట్టవచ్చు. 1980 అటవీ చట్టంలో అటవీ భూములను ఇతర అవసరాల కోసం విద్యుత్‌ ప్రాజెక్టులు, మైనింగ్‌, బాక్సైట్‌ తవ్వకాలు లాంటివి గ్రామ సభలు లేకుండా చేపట్టటం కుదరదు. గ్రామ సభల ఆమోదం తప్పనిసరి. ఇప్పుడు ఈ తాజా చట్ట సవరణ ద్వారా గ్రామసభల అవసరాన్ని రద్దు చేస్తోంది. అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లు అడవుల్లో యథేచ్ఛగా ప్రాజెక్టుల పేరుతో ప్రవేశిస్తే గిరిజనులు తమ భూముల్నుండి గెంటి వేయబడతారు.
          ఈ సవరణ మూలంగా కార్పొరేట్లు అడవుల్ని వాణిజ్యపరంగా వినియోగించేందుకు అవకాశం కలుగుతుంది. ప్రయివేటు తోటల పెంపకం, కాఫీ తోటలు పేరుతో దట్టమైన అడవుల్ని ధ్వంసం చేయడానికి వీలు కల్గుతుంది. స్వాతంత్య్రం వచ్చాక అడవుల పరిరక్షణతో పాటు - అడవుల్లో నివసించే వారికి వారి హక్కులను చట్టబద్ధం చేస్తూ చర్యలు చేపట్టబడ్డాయి. గిరిజనుల భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షణగా ఎన్నో చర్యలు వచ్చాయి. అటవీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా గిరిజనుల రక్షణకు ఉద్దేశించి పరిపాలనాపరంగా కూడా కొన్ని చర్యలు చేపట్టబడ్డాయి.
 

                                                                            రక్షణగా చర్యలు

అడవుల్లో బ్రిటీషు పాలకులు గిరిజనుల జీవనానికి ప్రమాదం తెచ్చినప్పుడు 1922 లోనే అల్లూరి సీతారామరాజు ప్రతిఘటన ప్రారంభించాడు. 1924లో రామరాజు కాల్చివేయబడేవరకు అడవుల్లో గిరిజనుల హక్కుల రక్షణ కొరకు ఎన్నో ప్రతిఘటనలు జరిగాయి. ఇదే తీరులో అదిలాబాద్‌ అడవుల్లో గిరిజనుల కోసం కొమరం భీమ్‌ పోరాడారు. దేశంలో ఇతర ప్రాంతాల్లోను అడవుల మీద బ్రిటీషువారి దోపిడి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వందలాది తిరుగుబాట్లు జరిగాయి. ఈ ఉద్యమాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం రాగానే అనేక రక్షణా చర్యలు తీసుకోబడ్డాయి. కేవలం విద్య ఉపాధి అంశాల్లో రిజర్వేషన్లు ప్రకటించడమే కాదు, అటవీ ప్రాంతాల్లో గిరిజనుల స్వాధీనంలో ఉన్న భూము లు అన్యాక్రాంతం కాకుండా రెవిన్యూ చట్టాలలో రక్షణలు కల్పించారు. గిరిజనులకు న్యాయం జరగాలంటే గిరిజన ప్రాంతాల పరిపాలనలోనూ గిరిజనులకే రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగానూ చర్యలు తీసుకున్నారు. 1/70 రెగ్యులేషన్స్‌ జీవో నెం-3 లాంటివి కొన్ని అంశాల్లో గిరిజనులకు రక్షణగా నిలిచాయి. అటవీ హక్కుల చట్టమూ వచ్చింది. అయితే ఇప్పుడు మార్చి 29న ప్రకటించిన సవరణ ప్రకారం ప్రాజెక్టులు చేపట్టడానికి గ్రామసభలు అనుమతులు అవసరం లేదని చెప్పడమే గాదు టూరిజం, మైనింగ్‌ ఇతర ప్రాజెక్టుల చర్యలు కాంట్రాక్టర్లు, కార్పోరేట్లు అడవుల్ని కొల్లగొట్టడానికి అవకాశం ఇస్తోంది. పార్లమెంటులో ప్రకటించిన వివరాలను బట్టి 2008-09 నాటికే 2.53 లక్షల హెక్టార్ల అడవి ఇతర ప్రాజెక్టుల కోసం మళ్లించబడింది. ఈ నాటి సవరణతో అడవులు ఎక్కువగా ధ్వంసంగావడానికే అవకాశం ఇస్తుంది.
 

                                                                         భూస్వాధీనం - హక్కులు

మైదాన ప్రాంతాల్లోనైనా ఏదయినా ప్రాజెక్టు చేపట్టేటప్పుడు భూములు కోల్పోయినవారు దాని ప్రభావంతో జీవనాధారం కోల్పోవడాన్ని అంచనా కట్టాలి. అలాగే పర్యావరణ రక్షణకు జరిగే నష్టాలను అంచనా కట్టాలి. ఇది ఇప్పటికే 1980 అటవీ చట్టంలో రక్షణగా ఉన్న అంశం. ఇప్పుడు ఈ చట్ట సవరణలో ఈ నిబంధనకు మినహాయింపు ఇచ్చారు. ఏ తరహా ప్రాజెక్టులకు అడవుల్లో నిబంధనలు సడలించవచ్చో ఒక జాబితా ప్రకటించారు. విద్యుత్‌, మైనింగ్‌, టూరిజం లాంటి అంశాల్ని లిస్టులో పేర్కొన్న అనంతరం అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు అడవులు కేంద్రం అవుతాయి. గిరిజనుల జీవనాధారం ప్రశ్నార్ధకం అవుతుంది.
         ఈ చట్ట సవరణ అడవిని పునర్‌ నిర్వచనం చేస్తోంది. అడవిలో నివశించే గిరిజనులకున్న హక్కుల్ని విస్మరిస్తోంది. బ్రిటీషువారి 1927 చట్టంలో గిరిజనుల జీవన హక్కులు గుర్తించబడలేదు. అటవీ పరిరక్షణ, పర్యావరణం గురించి ఒక్కమాట కూడా అందులో లేదు. అడవుల్లో చేపట్టే ప్రాజెక్టుల వల్ల భూహక్కులు కోల్పోయే బాధితుల ప్రస్తావనే ఇందులో లేదు. అడవుల రక్షణ కోసం ఇప్పటికే రిజర్వు ఫారెస్టు దాని సమీపంలోని 100 కిలోమీటర్ల వరకు కొన్ని రకాల కార్యకలాపాలకు అవకాశం లేకుండా షరతులు విధించబడ్డాయి, ఇప్పుడు వీటన్నింటనీ తొలగించారు. అడవుల్లో చెట్లు నరికిన చోట మళ్లీ చెట్టు నాటాలన్న నిబంధనకు సడలింపు ప్రకటించారు. అడవుల్లో జంతువుల వేట సఫారీ సాగించడానికి అవకాశం కల్పిస్తున్నారు. ప్రయివేటు పెట్టుబడికి ప్రోత్సాహం పేరుతో ఖనిజ నిక్షేపాల అన్వేషణ, గనుల తవ్వకాలు అనుమతి ఇవ్వబడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చట్ట సవరణ అడవుల్ని ప్రైవేటీకరించడానికి అవకాశం ఇస్తుంది. కొంత భాగం భూముల్లో కలప పెంచడానికి కార్పొరేట్లకు అవకాశం ఇస్తుందని బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన సందర్భంలో పత్రికలలో వ్యాఖ్యానాలు వచ్చాయి. అందువల్ల అటు పర్యావరణం, ఇటు గిరిజనుల మనుగడ ఈ సవరణతో ప్రమాదంలో పడుతుంది.
            బ్రిటీషువారు రాక ముందు అడవుల మీద, అందులో నివశించే గిరిజనుల జీవనం మీద రాజులు, రాజ్యాలు చొరబాటు గాని, జోక్యం గాని లేదు. అడవుల్లో నివశించే గిరిజన తెగలు తమ జీవనం అడవుల మీద ఆధారపడి వుంది గనుక వాటిని కాపాడ్డానికి కొన్ని కట్టుబాట్లు, రక్షణ చర్యలు చేపట్టి కాపాడారు. వేట సైతం దట్టమైన అడవుల మీద ఆధారపడి వుంది గనుక దట్టమైన అడవుల్ని కాపాడటం తమ బాధ్యతగా గుర్తించి వ్యవహరించారు. అందువల్లే అడవులు దేశంలో ప్రజల సంపదగా చరిత్రకారులు పేర్కొన్నారు. అడవుల మనుగడ, గిరిజనుల జీవనం పెనవేసుకున్న అంశాలుగా పేర్కొని 2006లో అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు అది పూర్తిగా రద్దవుతుంది. ప్రజా ప్రతిఘటనే మార్గం.
 

/వ్యాసకర్త సిపియం కేంద్రకమిటీ మాజీ సభ్యులు /
పి. మధు

పి. మధు