May 18,2023 21:45
  • ఎఎఫ్‌సి మహిళల ఒలింపిక్స్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌-2

న్యూఢిల్లీ: ఎఎఫ్‌సి మహిళల ఒలింపిక్స్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌-2లో భారత్‌కు గట్టి పరీక్ష ఎదురుకానుంది. భారతజట్టు ఉన్న గ్రూప్‌లో జపాన్‌, వియత్నాం, ఆతిథ్య ఉజ్బెకిస్తాన్‌ జట్లు ఉన్నాయి. ఈ టోర్నీ అక్టోబర్‌ 23నుంచి నవంబర్‌ 1 వరకు జరగనుంది. భారత్‌ ఈ ఏడాది జరిగిన రౌండ్‌-2లో కిర్గిజ్‌ రిపబ్లిక్‌పై 5-0 మరియు 4-0గోల్స్‌ తేడాతో గెలిచి ప్లే-ఆఫ్‌కు చేరింది. గ్రూప్‌-సిలో ఉన్న భారత జట్టు 61వ ర్యాంక్‌తో బరిలోకి దిగుతోంది. ఇక జపాన్‌ జట్టు 2012 ఒలింపిక్స్‌లో రజిత పతకం సాధించగా.. ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ 11వ స్థానంలో ఉంది. ఇక వియత్నాం జట్టు గత ఏడాది జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో అరంగేట్రం చేసి ప్రస్తుతం 33వ ర్యాంక్‌లో ఉంది. ఇటీవల కిర్గిజ్‌ రిపబ్లిక్‌తో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌ జట్టు 2-3గోల్స్‌ తేడాతో ఇంజూరీ సమయంలో గెలిచింది. ఇక భారత్‌ 2019లో జపాన్‌తో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకొని 1997 ఆసియా మహిళల ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో 0-1తో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో విజేతగా, రన్నరప్‌గా నిలిచిన జట్లు 2024 ఒలింపిక్స్‌కు ఆసియా ఖండంనుంచి ప్రాతినిధ్యం వహించనున్నాయి.