Mar 08,2023 11:39
  • పశ్చిమ దేశాలు ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని వీడాలి : మీడియా గోష్టిలో చైనా విదేశాంగ మంత్రి కిన్‌ గాంగ్‌

బీజింగ్‌ : తైవాన్‌ అంశాన్ని ముందుకు తేవడం ద్వారా ఆసియాలో ఉక్రెయిన్‌ తరహా సంక్ష్షోభాన్ని పునరావృతం చేయాలని చూస్తే సహించేది లేదని చైనా హెచ్చరించింది. అమెరికా తన ప్రపంచాధిపత్యం కోసం ఉక్రెయిన్‌ను ఓ ప్రయోగశాలగా చేసుకుని యుద్ధాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో చైనా ఈ హెచ్చరిక చేసింది. నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ (ఎన్‌పిసి) సమావేశాలు జరుగుతున్న సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి కిన్‌ గాంగ్‌ మంగళవారం నాడిక్కడ మీడియా గోష్టి నిర్వహించి కీలకమైన అంతర్జాతీయ సమస్యలపై చైనా వైఖరిని పునరుద్ఘాటించారు. చైనా-రష్యా బంధం వల్ల ఏ దేశానికి ఎలాంటి ముప్పు ఉండబోదన్నారు. మూడవ పక్షంగా ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, అసమ్మతిని ఎగదోయడం వంటి చర్యలకు తాము పూర్తి వ్యతిరేకమని అన్నారు. ప్రపంచానికి ద్రవ్యోల్బణం ఇప్పుడొక పెను ముప్పుగా పరిణమించిందని అన్నారు. పశ్చిమ దేశాలు తమ ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని వీడాలని, ఈ విషయంలో ప్రజల వాణిని అవి చెవికెక్కించుకోవాలని అయన హితవు పలికారు. తైవాన్‌ వ్యవహారంలో జోక్యం చేసుకునే హక్కు ఏ దేశానికి లేదని ఆయన మరోసారి ఉద్ఘాటించారు. తైవాన్‌ అంశం చైనా అంతర్గత వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రపంచ ప్రజానీకంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని, యూరప్‌లో సెక్యూరిటీ గవర్నెన్స్‌ పెరిగిపోతోందని అన్నారు. యుద్ధం కన్నా శాంతికి, ఆంక్షల కన్నా చర్చలకు, రెచ్చగొట్టే చర్యల కన్నా చర్చలకే తాము అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. చైనా దౌత్యంలో దయ, సుహృద్భావాలకు కొదవ లేదు, అయితే జిత్తులమారి నక్కలు, తోడేళ్లు వంటి వాటిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వాటితో ఘర్షణ పడడం తప్ప చైనాకు మరో మార్గం లేదన్నారు. మాతృ భూమి రక్షణకు వారితో ముఖాముఖి తలపడక తప్పదని ఆయన తేల్చి చెప్పారు.
చైనా ఆధునీకీ కరణ అంటే శాంతి, అభివృద్ధి, సహకారం, పరస్పర ప్రయోజనాలు, మానవాళికి ప్రకృతికి మధ్య సామరస్యత ద్వారా సాధించేదే తప్ప యుద్ధం, వలసాధిపత్యం, వనరులను కొల్లగొట్టడం వంటి వాటికి పాల్పడడం కాదని కిన్‌ గాంగ్‌ అమెరికానుద్దేశించి వ్యంగ్యంగా అన్నారు. పశ్చిమ దేశాల ఆధునీకరణకు భిన్నమైన కొత్త పంథా తమది అని ఆయన చెప్పారు. బెల్ట్‌ అండ్‌ రోడ్డు ఇనిషియేటివ్‌ ఉన్నత ప్రమాణాలతో, మంచి ఉద్దేశంతో చేపట్టినదన్నారు. మిగిలిన భాగస్వాములనందరినీ కలుపుకుంటూ, దాని వల్ల వచ్చే ప్రయోజనాలు ప్రపంచంతో పంచుకుంటుందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ప్రపంచ జనాభాలో 80 శాతానికి, ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో 70 శాతానికిపైగా ప్రాతినిధ్యం కలిగి వున్నాయని, కాబట్టి వర్థమాన దేశాల ప్రజలు మెరుగైన జీవితం కలిగివుంటే హక్కు ను కోరుకోవడం తప్పేమీ కాదన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో వర్థమాన దేశాలు తమ వాణిని గట్టిగా వినిపించే అవకాశం ఉండాలని, తగిన ప్రాతినిధ్యం కూడా ఉండాల్సిన అవసరముందన్నారు.

                                 వారు మమ్మల్ని అణగదొక్కాలని చూస్తున్నారు : అమెరికా వైఖరిపై మండిపడ్డ చైనా

ఇండో-పసిఫిక్‌ వ్యూహం ద్వారా 'చైనాను ముట్టించడానికి' అమెరికా ప్రయత్నిస్తోందని కిన్‌ గాంగ్‌ విమర్శించారు. ''ప్రత్యేకమైన బ్లాక్‌లను ఏర్పాటు చేసి, ఘర్షణలను రెచ్చగొట్టి, ప్రాంతీయ సమగ్రతకు విఘాతం కలిగించాలన్నదే అమెరికా అనుసరించే ఇండో-పసిఫిక్‌ వ్యూహం లక్ష్యం.'' అని అన్నారు. ''ప్రాంతీయ భద్రతను పరిరక్షించేందుకే ఇండో-పసిఫిక్‌ వ్యూహం అని వారు చెబుతున్నారు, కానీ, వాస్తవానికి, ఆ వ్యూహం ఘర్షణలను రెచ్చగొడుతోంది. నాటోకు ఆసియా-పసిఫిక్‌ వర్షన్‌ను సృష్టించాలని భావిస్తోంది.'' అని చైనా విదేశాంగ మంత్రి అన్నారు. క్వాడ్‌,అకస్‌ (ఆస్ట్రేలియా, బ్రిటన్‌, అమెరికా) గ్రూపులను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఎన్‌పిసి సమావేశాల సందర్భంగా ప్రతినిధి బృందాన్ని ఉద్దేశించి అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చేసిన ప్రసంగంలో అమెరికాను నేరుగా విమర్శనాస్త్రాలు సంధించారు. చైనాను అన్ని విధాలుగా అదుపు చేయాలని, అణగదొక్కాలని అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. భారత్‌తో సంబంధాలపై కిన్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. బైడెన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న చైనా విధానం అసలు ఉద్దేశం తమను అన్ని రంగాల్లో అణగదొక్కాలన్నదేనని ఆయన విమర్శించారు.