Feb 01,2023 21:09

హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023ా24 బడ్జెట్‌పై పారిశ్రామిక సంఘాలు, కార్పొరేట్‌ వర్గాలు సానుకూలంగా స్పందించాయి. ఫిక్కీ, సిఐఐ, ఎఫ్‌టిసిసిఐ బడ్జెట్‌ను స్వాగతించాయి. ఇది వృద్థి ఆధారిత బడ్జెట్‌ అని పేర్కొన్నాయి.
ఎంఎస్‌ఎంఇలకు మద్దతు : సిఐఐ
''సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ)లకు మద్దతునిచ్చేలా బడ్జెట్‌ ఉంది. ఎంఎస్‌ఎంఇలకు రూ.2 కోట్ల వరకు క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌ పథకాన్ని కొనసాగించడం సహా ఇతర ప్రోత్సహాకాలు హర్షణీయం. చిన్న పరిశ్రమలకు మద్దతును ఇవ్వడం ద్వారా తిరిగి వాటి వృద్థి పుంజుకోనుంది. విత్త లోటును 6 శాతం దిగువనకు చేర్చాలనే లక్ష్యం స్వాగతించదగినది.' అని సిఐఐ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భన్సల్‌ పేర్కొన్నారు.
బ్యాలెన్స్‌డ్‌గా ఉంది : ఫిక్కీ
''కేంద్ర బడ్జెట్‌ బ్యాలెన్స్‌గా, అభివృద్థికి దోహదంగా ఉంది. ప్రధానంగా వృద్థికి ప్రాధాన్యతను ఇచ్చింది. ఖచ్చితంగా ఇదే మేము కోరుకున్నది. వ్యవసాయ రంగంపై ప్రధాన దృష్టి పెట్టారు. అదే విధంగా పట్టణీకరణ, డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యతను ఇచ్చారు.'' అని ఫిక్కీ ప్రెసిడెంట్‌ సుభ్రకాంత్‌ పాండ తెలిపారు.
వృద్థికి దోహదం : ఎఫ్‌టిసిసిఐ
''మంత్రి సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సమ్మిళిత వృద్థికి దోహదం చేసేలా ఉంది. అన్ని రంగాలకు ప్రాధాన్యతను ఇచ్చారు. మౌళిక వసతుల అభివృద్థి, పెట్టుబడులు, విమానాశ్రయాలు, యవతకు అవకాశాలు, గిరిజనాభివృద్థి, గృహాలు, మోడల్‌ స్కూళ్లు తదితర అన్ని రంగాలను పరిగణలోకి తీసుకున్నారు. పన్ను పరిమితిని రూ.7లక్షలకు పెంచడం మంచి పరిణామం.'' అని ఎఫ్‌టిసిసిఐ ప్రెసిడెంట్‌ అనీల్‌ అగర్వాల్‌ అన్నారు.

ఆరోగ్య సంరక్షణపై దృష్టి : అపోలో హాస్పిటల్స్‌
''కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణపై ఎక్కువ శ్రద్ద చూపారు. హెల్త్‌కేర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌, 157 నూతన నర్సింగ్‌ కళాశాలలు, వైద్య పరికరాల తయారీ, ఆవిష్కరణల కోసం నూతన నైపుణ్య అభివృద్థి కోర్సులను ప్రకటించడం హర్షణీయం. ఆరోగ్య సంరక్షణ విభాగంలో పరిశోధన, ఆవిష్కరణలకు అవకాశాలను సృష్టిస్తుంది. హెల్త్‌కేర్‌ అప్లికేషన్‌లను అభివఅద్ధి చేయడానికి 5జి ల్యాబ్‌లను ప్రోత్సహించడం ద్వారా సుదూర భౌగోళిక ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఆరోగ్య సంరక్షణ కనెక్టివిటీ, సంరక్షణ మెరుగుపడుతాయి.'' అని అపోలో గ్రూపు హాస్పిటల్స్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కె హరి ప్రసాద్‌ పేర్కొన్నారు.