భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్కప్ జరగనుంది. ఈ మేరకు ఐసీసీ మంగళవారం వరల్డ్కప్కు సంబంధించిన షెడ్యూల్ను రిలీజ్ చేసింది. అయితే ఈ వరల్డ్కప్కు పలు స్టేడియాలకు మ్యాచ్లు కేటాయించకపోవడంపై ఆయా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వరల్డ్కప్ వేదికల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందంటూ ఆరోపణలు చేశారు.
మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అభిలాష్ ఖండేకర్ మాట్లాడుతూ.. ‘1987లో భారత్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఇండోర్ లో ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ మ్యాచ్ జరిగింది. ఇటీవలే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా భారత్.. ఇక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడింది. ఘన చరిత్ర ఉన్న ఈ స్టేడియానికి వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా దక్కకపోవడం బాధాకరం. ఈ టోర్నీలో మేం కనీసం రెండు, మూడు మ్యాచ్ లు అయినా దక్కుతాయని ఆశించాం. కానీ మాకు నిరాశే మిగిలింది..’అని తెలిపాడు.
ఇక పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ.. ‘వరల్డ్ కప్ షెడ్యూల్ ను చూస్తుంటే కేవలం మెట్రో నగరాలు, బీసీసీఐ బోర్డులో ఉన్న ఆఫీస్ బేరర్లు ప్రాతినిథ్యం వహించే నగరాలకు మాత్రమే వేదికలు దక్కాయి. మేం మొహాలీలో వరల్డ్ కప్ మ్యాచ్ లు ఉంటాయని భావించాం. కానీ ఒక్క మ్యాచ్ కూడా మాకు దక్కలేదు. కనీసం ప్రాక్టీస్ మ్యాచ్ కు కూడా మేం నోచుకోలేదు..’అని చెప్పాడు.
ఈ విమర్శలపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ''ప్రపంచ కప్ కోసం తొలిసారి పన్నెండు వేదికలను ఎంపిక చేశాం. ఇందులో చాలా వేదికలు గత ప్రపంచ కప్ల కోసం ఎంపిక కాలేదు. ఈ 12 వేదికల్లో తిరువనంతపురం, గువాహటి స్టేడియాల్లో వార్మప్ మ్యాచ్లు జరుగుతాయి. మిగతావన్నీ లీగ్లు, నాకౌట్ మ్యాచ్లకు అతిథ్యం ఇస్తాయి. మరిన్ని వసతులను కల్పించడంతోనే వాటికి అవకాశం వచ్చింది. సౌత్ జోన్ నుంచి నాలుగు, సెంట్రల్ జోన్ నుంచి ఒకటి, వెస్ట్ జోన్ నుంచి రెండు, నార్త్ జోన్ నుంచి రెండు వేదికలను ఎంపిక చేశాం. అలాగే ఢిల్లీ, ధర్మశాలలోనూ మ్యాచ్లు జరుగుతాయి. మ్యాచ్లను కేటాయించడంపై ఏ వేదికపైనా వివక్షత చూపలేదు. ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్లను మొహాలీ వేదికగానే నిర్వహించాం. విరాట్ కోహ్లి వందో టెస్టు మ్యాచ్ కూడా మొహాలీలో జరిగింది. మొహాలీలోని మల్లాన్పుర్ స్టేడియం సిద్ధమవుతోంది. ఒకవేళ రెడీగా ఉండుంటే వరల్డ్ కప్ మ్యాచ్కు వేదికయ్యే పరిస్థితి ఉండేది. ఇప్పుడున్న మైదానం ఐసీసీ స్టాండర్డ్స్కు తగ్గట్టుగా లేదు. అందుకే ఈసారి అవకాశం రాలేదు. ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్లను కేటాయించాం. వరల్డ్ కప్ కోసం మైదానాల ఎంపికలో ఐసీసీ నిర్ణయమే కీలకం'' అని శుక్లా వెల్లడించారు.










