కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మంగళవారం కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం లక్కసాగరం వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్దకు సిఎం చేరుకున్నారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న సిఎం జగన్కు జిల్లా కలెక్టర్ సృజన, రాష్ట్ర మంత్రులు గుమ్మనూరు జయరాం, అంబటి రాంబాబు, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మెల్యే సుధాకర్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ స్వాగతం పలికారు. అక్కడినుండి రాయలసీమ వరప్రదాయనిగా ఉన్న 77 చెరువులకు నీళ్లు అందించే లక్కసాగరం వద్ద పంప్హౌస్ను సిఎం జగన్ ప్రారంభించారు. దీంతో డోన్, పత్తికొండ,ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లో చెరువులకు నీరందింది. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి తాగు, సాగునీరు సరఫరా అయ్యింది. 10,394 ఎకరాలకు సాగునీరందించే పథకంగా ఈ కార్యక్రమాన్ని సిఎం జగన్ ప్రారంభించారు.










