Sep 17,2023 11:29

ప్రజాశక్తి-అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో ఈనెల 18,19 తేదీల్లో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. ముందుగా శ్రీనివాస సేతు ప్రారంభిస్తారు. అనంతరం ఎస్‌వీ ఆర్ట్స్‌ కాలేజ్‌ హాస్టల్‌ బిల్డింగ్‌ వర్చువల్‌ ప్రారంభోత్సవం, టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల చేరుకుని వకుళామాత రెస్ట్‌ హౌస్‌, రచన రెస్ట్‌ హౌస్‌లు ప్రారంభిస్తారు. ఆ తర్వాత బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. ఈకార్యక్రమం అనంతరం వాహన మండపం చేరుకుని పెద్ద శేష వాహనం దర్శించుకుంటారు. ఆ తర్వాత పద్మావతి అతిధి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు అని తెలిపారు. 19న ఉదయం 6.20 గంటలకు శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్న అనంతరం బయలుదేరి ఓర్వకల్లు చేరుకుంటారు. అక్కడి నుంచి కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరం చేరుకుంటారు. అక్కడ డోన్‌, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు సంబంధించి తాగు, సాగునీరందించే పథకాలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా డోన్‌ చేరుకుంటారు, అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు అని సీఎంవో ఓ ప్రకటనలో వెల్లడించింది.