ప్రజాశక్తి-అమరావతి : తమపై సిఐడి నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ మార్గదర్శి వ్యవస్థాపకులు చెరుకూరి రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఎమ్డి చెరుకూరి శైలజా కిరణ్ దాఖలు చేసిన వ్యాజ్యాలను మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నామని, అప్పటి వరకు పిటిషనర్లపై కఠిన చర్యలు తీసుకోరాదని సిఐడిని ఆదేశించింది. రామోజీరావు తమను తుపాకీతో బెదిరించి, తమ సంతకాలను ఫోర్జరీ చేసి మార్గదర్శి చిట్ఫండ్స్లోని తమ షేర్లను శైలజా కిరణ్ పేరిట రాయించుకున్నారంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్లో వాటాదారుడైన జెజె రెడ్డి కుమారుడు యూరి రెడ్డి సిఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో సిఐడి అధికారులు ఏ1గా రామోజీరావు, ఏ2గా శైలజను చేర్చుతూ కేసు నమోదు చేసింది.










