Sep 24,2023 15:14

హైదరాబాద్‌: చంద్రబాబుకు సంఘీభావంగా ర్యాలీ చేస్తున్న ఐటీ ఉద్యోగులను అడ్డుకోవడం అప్రజాస్వామికమని సినీ నిర్మాత, ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల కన్వీనర్‌ అట్లూరి నారాయణరావు పేర్కొన్నారు. పోలీసుల చర్యలను చూసి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ కక్షలతోనే చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అరెస్టుపై కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. త్వరలోనే చంద్రబాబు బయటకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.