Sep 15,2023 12:47

రాజమండ్రి : ఎపి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబుతో ములాఖత్‌కు ఆయన భార్య భువనేశ్వరి చేసుకున్న దరఖాస్తును జైలు అధికారులు నిరాకరించారు. ఈ వారంలో రెండుసార్లు చంద్రబాబు కుటుంబసభ్యులు ములాఖత్‌ అయ్యారు. మూడోసారి ములాఖత్‌కు ఉన్నతాధికారుల అనుమతి కావాలని జైలు సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం జైలు సూపరింటెండెంట్‌ సెలవుల్లో ఉండటంతో.. భువనేశ్వరి దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. వారానికి మూడుసార్లు ములాఖత్‌ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా.. అనుమతిని తిరస్కరించడాన్ని టిడిపి తప్పుబట్టింది. చంద్రబాబు అరెస్టయినప్పటి నుండి భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు. తన భర్తను అక్రమంగా అరెస్టు చేసిన ప్రభుత్వం.. ములాఖత్‌పైనా అమానవీయంగా వ్యవహరిస్తోందని భువనేశ్వరి ఆక్షేపించారు. నిబంధనల ప్రకారం ములాఖత్‌కు అవకాశం ఉన్నప్పటికీ ఇలా కాదనడం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.