
తెలుగు రాష్ట్రాలలో బిజెపి హడావుడి ప్రధాని మోడీ రాకతో పరాకాష్టకు చేరింది. అక్షరాలా అధికార కార్యక్రమమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయ దాడికి దిగిన మోడీ దాదాపు ఎన్నికల ప్రచార సభలా మార్చేశారు. ఒకటికి రెండు ఆడియో విజ్యువల్స్ ప్రదర్శిస్తూ రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి గొప్ప కృషి జరుగుతున్నట్టు చిత్రించుకున్నారు. తర్వాత స్వయంగా తన ప్రసంగంలోనూ అదే పాట పాడారు. దేశంలో ప్రాథమిక సదుపాయాల మెరుగుదల కోసం, రవాణా విస్తరణ కోసం కేంద్రం పరితపిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని తిట్టిపోశారు. తాను అవినీతిపై పోరాడుతుంటే కుటుంబ పాలన చేసేవారు అడ్డు తగులుతున్నారని ఆరోపణలు గుప్పించారు. మరో విధంగా చెప్పాలంటే పరోక్ష భాషలో బిఆర్ఎస్ ప్రభుత్వంపై, కెసిఆర్ కుటుంబంపై కసితీరా దాడి చేశారన్నమాట. ఇతర పార్టీల ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కలసిరావడం లేదని అందరిపై అభాండం వేశారు. దానికి ముందు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మోడీ నాయకత్వం వర్థిల్లాలని పదేపదే నినాదాలు చేయించి తమ ఉద్దేశం బయిటపెట్టుకున్నారు. హైదరాబాద్కు చార్మినార్ సంకేతమైతే మోడీ మాత్రం భాగ్యలక్ష్మి ఆలయం చిహ్నమనడంలోనూ, కిషన్ రెడ్డి పదేపదే హిందువులు తిరుపతి దేవుణ్ని చూడాలనుకుంటారని నొక్కి చెప్పడంలోనూ వారి మత రాజకీయం బహిర్గతమైంది. అంతేగాక సంతుష్టీకరణ విధానాల పేరిట మైనార్టీ సంక్షేమంపై ధ్వజమెత్తే బిజెపి నిరంతర పల్లవి కూడా ఆలపించారు.
- ఎ.పి లో మూడు పార్టీల వంత
నిజానికి దేశంలో వందేభారత్ రైలుకు పదోసారి పచ్చ జెండా ఊపడం మోడీకే చెల్లింది. దశాబ్దాలుగా నడుస్తున్న ఎం.ఎం.టి.ఎస్ పనులకు కూడా మరోసారి శంకుస్థాపన చేశారు. అయితే ఇవేవీ యాదృచ్ఛికమైనవి కానే కాదు. తెలంగాణలో ఒక విధంగా, ఆంధ్రప్రదేశ్లో మరో విధంగా రాజకీయ పరిస్థితులు వున్నప్పటికీ బిజెపి మాత్రం ఏకైక లక్ష్యంతో పావులు కదుపుతున్నది. ఇక్కడి ప్రాంతీయ పార్టీల ప్రాభవాన్ని దెబ్బ తీసి తను పాదం మోపడం. బిఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బిజెపి మతతత్వ రాజకీయాలు, కేంద్రం నిరంకుశ పోకడలపై తీవ్రంగా పోరాడుతున్నారు. ఈ విషయంలో వామపక్షాలు సహకారం ఇస్తున్నాయి కూడా. తామే అధికారంలోకి వస్తామని చెబుతున్న కాంగ్రెస్ విచిత్రంగా బిఆర్ఎస్, బిజెపి ఒకటేనని ఆరోపిస్తున్నది. మిగిలిన రెండు పార్టీలూ ఇదే విధంగా అవతలివారిపై ఆరోపణలు చేస్తున్నాయి. కొంతమంది కాంగ్రెస్ సీనియర్లు బిజెపిని ప్రధాన ప్రత్యర్థిగా చెబుతూ బిఆర్ఎస్తో అవగాహన సాధ్యమేనన్నట్టు మాట్లాడుతుంటారు. జాతీయ స్థాయిలో ఈ మధ్య చాలా సందర్భాలలో ప్రతిపక్ష కార్యాచరణలో ఈ రెండు పార్టీలూ కలసి పనిచేస్తున్నాయి గాని రాష్ట్రంలో ఆ సూచనలు లేవు. అదే ఎ.పి ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మోడీ సర్కారుతో సత్సంబంధాలు నెరుపుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా బిజెపితో సత్సంబంధాలు వున్నట్టు చూపించుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో సన్నిహితంగా మెలుగుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంతకు ముందు నుంచి బిజెపితో మిత్రుడుగా కొనసాగుతూ వచ్చే ఎన్నికలలో ఓట్ల చీలిక నివారిస్తానంటున్నారు. వైసిపి సర్కారు లాగే టిడిపి, జనసేన కూడా బిజెపి కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేయడం గాక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉమ్మడి పోరాటం చేయాలని, లౌకిక ప్రజాస్వామ్యం కాపాడుకోవాలని సిపిఎం నొక్కి చెబుతున్నది. ఇటీవలే ముగిసిన సిపిఎం రాష్ట్ర కమిటీ ఇదే విషయం నొక్కి చెప్పడమే గాక కార్యాచరణ కూడా ప్రారంభించింది. తాజాగా పోలవరం నిర్వాసితుల సమస్యలపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ఇందుకో ఉదాహరణగా చెప్పొచ్చు. ఆ సమావేశంలో టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకూ సీనియర్ నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావుకు మధ్య జరిగిన చర్చ ఇందుకు అద్దం పడుతుంది. పోలవరం విషయంలో కీలకమైన కేంద్రాన్ని పక్కన పెట్టి గత, ప్రస్తుత ప్రభుత్వాల కోణంలోనే విమర్శలు గుప్పిస్తే ఉపయోగం ఏమిటన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం. నిజానికిది ఎ.పి రాజకీయాలలోనే సంక్లిష్టమైన అంశం.
బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్య అవగాహన, ఉద్యమాలు ఉమ్మడి పోరాటం పెరుగుతున్న కొద్దీ వచ్చే ఎన్నికలలో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడం బిజెపికి పెద్ద సవాలుగానే తయారవుతున్నది. నిరంకుశ కార్పొరేట్ మతతత్వం, అదానీ కుంభకోణాలు, రాహుల్ అనర్హత వేటు వంటి వాటిపై అనేక రూపాల్లో వ్యక్తమవుతున్న నిరసనలు ప్రజాగ్రహాలు బిజెపిని భయపెడుతున్నాయి. బలమైన ప్రాంతీయ పార్టీలూ, వామపక్షాలు వున్న చోట గతంలో వలె నల్లేరు మీద బండిలా గెలవలేకపోవచ్చన్న వాస్తవం భయపెడుతున్నది. ఉన్న మిత్ర పక్షాలు కూడా దూరం కాగా కలసివచ్చే వారు కరువవుతున్నారు. అందులోనూ దక్షిణాదిన కాలూనడం బిజెపికి ఎప్పుడూ సవాలుగానే వుంది. కర్ణాటక చేజారవచ్చన్న అంచనాలు అన్ని వైపులా వినిపిస్తున్నప్పుడు కేరళ, తమిళనాడులలో ఠికాణా లేనప్పుడు తెలుగు రాష్ట్రాలపైనే ఆ పార్టీ అధిష్టానం దింపుడు కళ్లం ఆశ పెట్టుకుంది.
- ప్రాంతీయ పార్టీల తీరు
మొదటగా టిడిపి 41వ వ్యవస్థాపక సభ హైదరాబాదులో జరిగింది. చంద్రబాబు ప్రసంగంలో బిజెపి విధానాలపై ఒక్క విమర్శ కూడా లేకపోగా ఒకటి రెండు సార్లు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెప్పారు. ఆయనతో కలసి తాను సాధించిన విజయాలు కూడా చెప్పడమే గాక పరోక్షంగా నోట్ల రద్దును సమర్థించారు. పవన్ కళ్యాణ్తో చంద్రబాబుకు అవగాహన వుందనీ, జనసేన సీట్ల వరకూ చెప్పి బిజెపి విషయం తనకు వదిలేయమని ఆయనకు చెప్పారని టిడిపి కీలక నాయకులు చెబుతున్నారు. ఈ మధ్య ఒకటి రెండు సందర్భాలను పురస్కరించుకుని బిజెపి అధ్యక్షుడు నడ్డా టిడిపి గురించి సానుకూల సందేశాలిచ్చారు. అయితే వారే తమ వెంటపడుతున్నారని బిజెపి నేతలంటారు. ఈ మధ్యలో ముఖ్యమంత్రి జగన్ ఒకటికి రెండు సార్లు ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో సహా కేంద్ర మంత్రులను కలసి వచ్చాక పార్లమెంటులో ఎ.పి ప్రశ్నలకు దాటవేత సమాధానాలు ఇచ్చారు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేది లేదనీ చెప్పారు. జగన్ ప్రభుత్వం ఎంత సానుకూలంగా చిత్రించినా పోలవరం సహా ఏ సమస్యపైనా కేంద్రం అవసరమైన చర్యలు చేపట్టింది, నిధులు విడుదల చేసింది లేదు. విచిత్రంగా ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లారు. ఆ పార్టీ ఎంత హంగామా చేసినా కంటి తుడుపుగా కొద్దిసేపు నడ్డా కలిశాననిపించారు తప్ప భాగస్వామిగా ఆదరించింది లేదు. ఓట్ల చీలిక నివారించడం అనే పాట తప్ప పవన్ కొత్తగా చెప్పింది లేదు. మోడీ విశాఖ రాకలోనూ ఇలా కొద్దిసేపు భేటీ జరిపి రాష్ట్రానికి మంచిరోజులు వస్తాయి అని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనూ సాధించింది శూన్యమే. ఎ.పి విషయంలో సానుకూల చర్చలు తీసుకునే ఉద్దేశమే బిజెపికి లేదని దీంతో మరోసారి స్పష్టమైంది. అయితే దీని తర్వాత కూడా జనసేన నాయకులు కేంద్రం ఏదో వొరగబెట్టినట్టు రాష్ట్రానిదే తప్పయినట్టు మాట్లాడటం వింతగొల్పుతుంది. రాహుల్ గాంధీ అనర్హత సమస్యపై కలసి రావాలని కె.వి.పి.రామచంద్రరావు ప్రత్యేకంగా అభ్యర్థించినా టిడిపి నుంచి అధికారిక స్పందన లేదు! మేము కష్టాల్లో వున్నప్పుడు మాతో కలసిరాని పార్టీలతో మేమెందుకు కలవాలని టిడిపి నేతలు జవాబిచ్చారు. కనుకనే మూడు ప్రాంతీయ పార్టీలూ ఏదో రూపంలో బిజెపి వ్యూహాలకే ఊతమిస్తున్న తీరును సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఇటీవలి రాష్ట్ర కమిటీ సమావేశానంతరం నిశితంగా విమర్శించారు.
కొత్త పార్టీగా వచ్చిన వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు షర్మిల బిజెపితో కలసి కార్యక్రమాలు ప్రతిపాదించడం, రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరడం ఇదే కోవలో వుంది. నిరుద్యోగ సమస్యపై అంతా కలసి పని చేయాలని చెప్పే పేరుతో ఇటీవల ఉభయ కమ్యూనిస్టు పార్టీల కార్యాలయాలను సందర్శించిన షర్మిల ఆ పార్టీలపై అనుచిత ఆరోపణలు చేస్తే తమ్మినేని గట్టిగానే ఖండించారు. బిజెపి హానికర విధానాలకు వ్యతిరేకంగా బిఆర్ఎస్కు మునుగోడు ఎన్నికలలో మద్దతివ్వడం సరైందేననీ స్పష్టం చేశారు. కమ్యూనిస్టులు బిఆర్ఎస్ బి టీమ్గా వున్నారని మీరు మా ఆఫీసుకు వచ్చి నిందలు వేయడం మర్యాద కాదని షర్మిలకు సూటిగానే చెప్పారు. మీడియా లోనూ ఇది ప్రధాన చర్చనీయాంశమైంది.
- నిరసనలే సమాధానం
తెలంగాణలో తామే అధికారానికి రాబోతున్నామని ఆర్భాటం చేసిన బిజెపి కి క్షేత్రస్థాయిలో పరిస్థితి అనుకూలంగా లేదని తేలిపోయింది. లిక్కర్ కేసు పేరిట బిఆర్ఎస్ ఎంఎల్సి కవితను అనేకసార్లు విచారించడమే గాక అరెస్టు అనివార్యం అని హల్చల్ చేసినా ఇంతవరకూ అది సాధ్యం కాలేదు. ఇక ముందు ఏమయ్యేది తెలియదు. దేశవ్యాపితంగానే ప్రతిపక్షా లు ఇ.డి, సిబిఐ ల దుర్వినియోగాన్ని రాజకీయంగా న్యాయపరంగా కూడా సవాలు చేయడం వాతావరణం మార్చింది. ఈలోగా ప్రశ్నాపత్రాల వ్యవహారంలో బిజెపి పాత్ర అనుమానాస్పదంగా తేలి సాక్షాత్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు అరెస్టయ్యారు. బెయిలు మీద ఆయన వచ్చినా కేసు కొనసాగుతున్నది. బిజెపి ఆశించినట్టు ప్రముఖులెవరూ ఆ పార్టీలో చేరింది లేదు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం చేరారు గాని ఆయన వల్ల ఒరిగేది లేదని బిజెపి నేతలే చప్పరిస్తున్నారు. తెలంగాణలో ఆశించింది జరగలేదని అర్థమైన మోడీ, అమిత్ షా లు పదేపదే పిలిచి మాట్లాడటం, పర్యటించడం సర్వసాధారణమైపోయింది. బిఆర్ఎస్ స్థాపన తర్వాత కెటిఆర్ ఎ.పి వ్యవహారాలపైనా దృష్టి పెంచి విశాఖ ఉక్కుపై లేఖ రాయడం చర్చకు కారణమైంది. ఈలోగా సింగరేణిలో అయిదు బావులు వేలం పెట్టడంతో విశాఖ ఉక్కు తంతు పునరావృతమవుతున్నది. మోడీ పర్యటన సమయంలోనే బిఆర్ఎస్ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు ఆయనకు నిజమైన సమాధానంగా వున్నాయి. తెలంగాణలో సిపిఎం చైతన్య యాత్రలు పూర్తికాగా సిపిఐ సాగిస్తున్నది. ఎ.పి లోనూ ఉభయ పార్టీలూ 14వ తేదీ నుంచి ప్రజా సమీకరణలకు, ప్రచారోద్యమానికి శ్రీకారం చుడుతున్నాయి.
తెలకపల్లి రవి