Mar 05,2023 06:34

త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ ఫలితాల తర్వాత ఈశాన్య రాష్ట్రాలలో బిజెపి విజయాలు చారిత్రాత్మకమైనట్టు మోతమోగుతున్నది. ఇందుకు ప్రధాని మోడీ వ్యక్తిగత ప్రభావం కారణమైనట్టు, ఆయన పథకాలతో అభివృద్ధి సంక్షేమం మెరుగయ్యాయని సంతోషించినందుకే ప్రజలు గెలిపించినట్టు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్నది. ఉత్తరాదికే పరిమితమైన పార్టీగా చెప్పుకునే బిజెపి దేశం మూలమూలనా చొరబడిందని ఈ ఫలితాలతో తిరుగులేని విధంగా రుజువైందనే పల్లవి వినిపిస్తున్నది. త్రిపురలో వామపక్షాలు, అలాగే కాంగ్రెస్‌ పార్టీ దెబ్బతినడం కీలక పరిణామంగా చిత్రించబడుతున్నది. ఎన్నికల్లో జయాపజయాలను బట్టి ఈ విధమైన వాదనలు ప్రచారాలు సాగడంలో ఆశ్చర్యం లేదు గానీ పూర్తి వాస్తవమేమిటనేది కూడా అర్థం చేసుకోవడం అవసరం. ఈ ఫలితాలలో బిజెపికి అంత సీన్‌ కనిపించిందా? ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాలలోనూ వాటితోపాటు జరిగిన ఉప ఎన్నికలలోనూ బిజెపి సాధించిన ఫలితాలేమిటి, పరిమితులేమిటి? లోతుగా చూడాల్సి వుంది. అలా చూసినప్పుడు బిజెపి నేతలు అంతగా జబ్బలు చరుచుకోవలసిన అద్బుత ఫలితాలేమీ కాదని, అవైనా అనేక అక్రమాలు ధనబలం నిర్బంధంతో లభించినవేనని స్పష్టమవుతుంది. పైగా ఇవి చాలా చిన్న రాష్ట్రాలను వశపర్చుకోవడం కోసం ప్రపంచంలోనే పెద్దదిగా టముకు వేసుకునే పార్టీ పడరాని పాట్లు పడటం. ఫలితాలు రాగానే ప్లేటు మార్చడం కూడా కనిపిస్తుంది. ఈ చిన్న రాష్ట్రాలలో ఇతరులతో రకరకాల బేరసారాలు మత రాజకీయాలు నెరిపిన బిజెపి ఇదేదో దేశవ్యాపిత విజయంలా చెప్పుకుంటే మీడియా కూడా వంతపాడటం వింత గొల్పుతుంది. అరుణాచల్‌ప్రదేశ్‌, అస్సాం, మణిపూర్‌, త్రిపురల్లో బిజెపి అధికారానికి రావడం, మేఘాలయ, మణిపూర్‌లలో మిత్రపక్షాల సాయంతో పాగా వేయడం గొప్ప పరిణామాలుగా చెప్పేవారు. గతంలోనూ కేంద్రంలోని కాంగ్రెస్‌ ఈ తరహా ఆధిక్యత నడిపించుకుందని మర్చిపోతుంటారు. ఈశాన్య రాష్ట్రాలు గానీ జమ్మూ కాశ్మీర్‌గాని కేంద్రంలో ప్రభుత్వాన్ని బలపరిస్తే తప్ప బతకలేని దురవస్థ ఇందుకు కారణమని దేశమంతటికీ తెలుసు. మోడీ హయాంలో పెద్ద పెద్ద రాష్ట్రాలకే నిధులు కేటాయించకుండా వివక్షతో దాడులతో లోబర్చుకుంటున్న నేపథ్యం ఈశాన్యానికి మరింత ఎక్కువగా వర్తిస్తుందని చెప్పనవసరం లేదు. పైగా అధికార అవకాశవాదంలోనూ వేర్పాటువాద పోకడలలోనూ అక్కడి పాలకపక్ష నాయకులు ఆరితేరారు గనక ఆ పని మరింత తేలికే. 35 ఏళ్లు వామపక్ష పాలనలో స్థిరత్వం కాపాడుకున్న త్రిపుర మినహా అన్నిచోట్లా ఇదే జరిగేది. దాన్నే మోడీ, హోంమంత్రి అమిత్‌షా వంటి వారు తమవైపునకు తిప్పుకోవడంలో గొప్పతనమేమీ లేదు. వీటిలోని హెచ్చరికను గుర్తించడం అవసరమే అయినా అతిశయోక్తులను ఆమోదించనవసరం లేదు.

  • త్రిపురలో జరిగిందేమిటి?

ఇప్పుడు ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లోనూ ఒక్క త్రిపురలో మాత్రమే బిజెపి తానుగా ఆధిక్యత సాధించింది. అందుకోసం ఎన్ని దౌర్జన్యాలూ నిర్బంధాలు జరిగాయో గతవారం చెప్పుకున్నాం. స్వేచ్చగా ఓటేయనిస్తే తప్పక గెలుస్తామని మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ చేసిన వ్యాఖ్య నేను గుర్తు చేశాను. అలా జరగడం లేదనీ దాడులతో పాటు అక్రమాలు ధనప్రలోభాలు పెరుగుతున్నాయని సిపిఎం నాయకులు అనేకసార్లు ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చారు. కాని అవి ఆగింది లేదు. గిరిజన ప్రాంతాలలో ఎన్నికల ముందే పుట్టుకొచ్చిన త్రిప్రి మోతె పార్టీ ఓట్ల చీలికలోనూ సీట్ల చీలికలోనూ పెద్ద ప్రభావమే చూపింది. దాంతో కేంద్ర బిజెపి నాయకులు మంతనాలాడారు. ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక దేశం అంటున్నా వారి మంతనాలు ఆగలేదు. ఆ ఒక్కటి తప్ప అన్నిటికీ సిద్ధమని బాహాటంగానే సంకేతాలిచ్చారు. ఇంతకూ ఈ పార్టీ ఎవరిదంటే పిసిసి అధ్యక్షుడుగా వుండి నిష్క్రమించిన మాజీ యువరాజు ప్రద్యుమ్నది. అంటే ఆయన కాంగ్రెస్‌ ఓట్లలోనూ గండిపెట్టాడనేది స్పష్టమే. సీట్ల సర్దుబాటులోనూ చివరిదాకా సాగదీసిన కాంగ్రెస్‌ నాయకత్వం పాత్ర మరొకటి. ఇన్నిటి మధ్య సిపిఎం, వామపక్షాల నాయకులు ప్రాణాలకు వెరవక పోరాడారు. బిజెపి విచ్చిన్నశక్తుల దాడులను ఎదుర్కొన్నారు. ఫలితాలు వచ్చాక చూస్తే కాంగ్రెస్‌తో పరస్పర పోటీ నివారణ చేసుకున్నప్పటికీ వామపక్షాల ఓట్ల శాతం పెరగకపోగా గతసారి కన్నా పదిహేను శాతం వరకూ తగ్గినట్టు కనిపిస్తుంది. ఈ ఒడంబడిక పొరబాటనే వాదనలు మీడియాలో మొదలైనాయి. విధానపరమైన నిర్ణయం గనక ఇప్పుడు దానిపై తర్జనభర్జనల కన్నా సమగ్ర సమీక్ష కోసం ఎదురుచూడటం మంచిది. కానీ అసలు సమస్య మాత్రం మరోసారి వేర్పాటు వాద విచ్చిన్నకర పోకడలు పెంచే శక్తులకు ఊతమివ్వడం. గతంలో ఆస్సాంలో కాంగ్రెస్‌ ఇలాగే చేయడం గుర్తుండే వుంటుంది. ఇప్పుడు బిజెపి అదే పని చేస్తున్నది. ఇంతా చేసినా ఐపిఎఫ్‌టితో కలసి కూడా అది అత్తెసరు ఆధిక్యతనే తెచ్చుకోగలిగింది. బిజెపిని వ్యతిరేకించేది తానేనన్నట్టు గొప్పలు పోయే తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా అన్నిచోట్ల పోటీ పెట్టి ఓట్ల చీలికకు కారణమైంది. వీటన్నిటినీ ఉపయోగించుకున్న బిజెపి నేతలు ఇప్పుడు మాత్రం మహిళలు యువత తమకు బాగా ఓటేశారని చెప్పుకుంటున్నారు. ఏమైనా రాజకీయంగా బిజెపికి అంతర్గత కలహాల మధ్య వచ్చిన త్రిపుర విజయం కీలకమే అవుతుంది. ఇన్ని నిర్బంధాల మధ్య సిపిఎం, ఇతర వామపక్ష కార్యకర్తల కృషి అభినందనీయం. త్రిప్రి మోతె రానున్న రోజులలో ఎలాటి సమస్యలు, సవాళ్లు సృష్టించేది బిజెపి అవకాశవాదం ఏ పరిణామాలకు కారణమయ్యేది చూడాల్సిందే.

  • మేఘాలయలో వెనకడుగు, నాగాలాండ్‌లో జూనియర్‌ పాత్ర

ఈశాన్య విజయం అంటూ అతిగా చెప్పుకుంటున్న బిజెపి మిగిలిన రెండు రాష్ట్రాలు నాగాలాండ్‌, మేఘాలయలో స్వంతంగా సాధించిందేమీ లేదు. మేఘాలయలో కొర్నార్డ్‌ సంగ్మా నాయకత్వంలోని నాగాలాండ్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పిపి) 26 స్థానాలతో పెద్ద పార్టీగా వచ్చింది. ఈ పార్టీతో కలసి మిశ్రమ కూటమిలో వుండిన బిజెపి ఎన్నికల ముందే వైదొలగింది. ఈశాన్యంలో అన్నిటికన్నా అవినీతికరమైన ప్రభుత్వం అది అని స్వయంగా హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. కాని ఇప్పుడు రెండుస్థానాలు గెలిచిన బిజెపి ఆ పార్టీతోనే చేతులు కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తున్నది. ఈ మేరకు సంగ్మా గవర్నర్‌ను కలిసి అవకాశం కోరాడు. అమిత్‌ షా సమక్షంలో ప్రమాణస్వీకారం చేయడానికి ముహూర్తం చూసుకుంటున్నారు.హిల్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన ఇద్దరు, మరో ఇద్దరు స్వతంత్రులు కూడా తమతో వున్నారని సంగ్మా చెబుతున్నా ఆ పార్టీలు మరోలా మాట్లాడుతున్నాయి. కేంద్రం వారిని దారికి తెచ్చినా ఆశ్చర్యం లేదు. 11 స్థానాలు తెచ్చుకున్న మాజీ పాలక కూటమి భాగస్వామి యుడిపి, రెండు తెచ్చుకున్న విపిపి పార్టీ కూడా బేరసారాలు సాగిస్తున్నాయి. ఇక నాగాలాండ్‌లో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నెయిఫియు రియో నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నది. నేషనలిస్టు డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డిపిపి) నాయకుడైన రియో కు 12 మంది బిజెపి సభ్యుల మద్దతు వున్నది.ఇక్కడ కూడా బిజెపి జూనియర్‌ భాగస్వామిగానే వుంది. కనుక బిజెపి ఈ రెండుచోట్ల గెలిచేసినట్టు చెప్పుకోవడం హాస్యాస్పదమే. పైగా అది మోడీ ప్రతిష్ట, బిజెపి విధానాల విజయంగా చెప్పడం మరీ విడ్డూరం. ఈ సర్కార్లు స్థిరంగా వుండటం కూడా కష్టమే. అయితే ముందే చెప్పుకున్నట్టు కేంద్రం మీద పరాధీనత వల్ల వారు అనివార్యంగా లోబడిపోతుంటారు. అందులో నిలబడిన వారిని బిజెపి తన వైపునకు తిప్పుకుంటుంది.ఈ ప్రక్రియకు ఆధ్వర్యం వహించే అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిస్వాస్‌ శర్మను కొందరు మరో మోడీగా వర్ణిస్తుంటారు కూడా.

  • మరో విడత తర్వాతే

హిందూత్వమే తమ సిద్దాంతమని రెచ్చగొట్టే బిజెపి ఈశాన్య భారతంలో అధికంగా వున్న క్రైస్తవ ఓటర్ల కోసం మరెవరికంటే అధికంగా బుజ్జగింపు విధానాలు అనుసరిస్తుంది. వారి మతపరమైన కోర్కెలకు పెద్దపీట వేస్తూ గిరిజనాభివృద్ధిని ఉపేక్షిస్తుంది. ఉత్తరాదిని గోరక్షణ గురించి గగ్గోలు పెట్టి అనేకమంది ప్రాణాలు పోవడానికి కారణమైన సంఘ పరివార్‌ ఈశాన్యంలో మాటమారుస్తుంది. గొడ్డుమాంసం తినడం అక్కడ సర్వసాధారణం గనక ఆవును పక్కన పెట్టేస్తుంది ! జెరూసలేము యాత్రలకు సహాయం వాగ్దానం చేస్తుంది. ఇవన్నీ మతసహనంతో చేస్తే ఫరవాలేదు గాని ఓట్లకోసమే కావడం విపరీతం. అస్సాంలో అత్యుత్సాహంతో హిందూత్వ పాఠాలు చెప్పే ముఖ్యమంత్రి శర్మ తక్కిన ఇతర చోట్ల మొత్తం మార్చేసి అదే తన చాణక్యమంటారు. ఇవన్నీ అవకాశవాద రాజకీయ విన్యాసాలే. ఉత్తరాదిలోనే పూర్తిగా గెలవలేని బిజెపి దక్షిణాన పాగా వేసేందుకు నిరంతరం విఫలయత్నాలు చేస్తున్నది. తూర్పు పశ్చిమల్లో కూడా దానికి ప్రత్యర్థి రాజకీయ శక్తులున్నాయి.
ఒరిస్సా, బెంగాల్‌ వంటి చోట్ల గెలవలేకపోతున్నది. దక్షిణాన సరేసరి. కర్ణాటక కూడా చేజారి పోతుందని ఢిల్లీ నేతలు భావిస్తున్నారు. ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్‌ మూడు, బిజెపి,మిత్రులు మూడు తెచ్చుకున్నారు, బెంగాల్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ చోటు సంపాదించింది. తమిళనాడులోని ఈరోడ్‌లోనూ మహారాష్ట్రలోనూ గెలిచింది. ఇవి మిత్రపక్షాల తోడువల్ల గెలిచినవే కావడం గమనార్హం. కాంగ్రెస్‌ ఇప్పటికీ బిజెపికి వ్యతిరేకంగా సరైన విధానం తీసుకోలేకపోవడం, తనే నాయకత్వం వహించాలన్నట్టు మాట్లాడుతుండడం కనిపిస్తుంది. ఇవన్నీ ఎలా వున్నా బిజెపి ఈశాన్య ప్రాంతంలో చిన్న చితక పార్టీలతో కలసి సాగించే కపట నాటకాన్ని దేశవ్యాపిత విస్తరణకు సాక్ష్యంగా చూపాలనుకోవడం కుదిరేది కాదు. ఈ ఏడాది కర్ణాటక, చత్తీస్‌ఘర్‌, మధ్యప్రదేశ్‌, మిజోరాం, రాజస్థాన్‌, తెలంగాణ, జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీల ఎన్నికల తర్వాత దేశ రాజకీయ ముఖచిత్రం మరింత స్పష్టమవుతుంది.ravi

 

 

 

 

తెలకపల్లి రవి