Oct 07,2023 15:02
  • సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి

ప్రజాశక్తి-కాకినాడ : గుంటూరు జిల్లా తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి కొద్ది దూరంలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో శుక్రవారం అపస్మారక స్థితికి చేరుకుని విధి నిర్వహణలో చనిపోయిన ఆశ వర్కర్‌ రేపూరి కృపమ్మ అధికారుల నిర్లక్ష్యం, జగన్మోహన్‌ రెడ్డి అధికార దాహం కలిసి చేసిన హత్యేనని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి విమర్శించారు. చనిపోయిన ఆశ వర్కర్‌ కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ రెగ్యులర్‌ ఉద్యోగం ఇవ్వాలని, ఇంటి స్థలం, ఇల్లు నిర్మించి ఇవ్వాలని, మరణానికి కారణమైన మెడికల్‌ ఆఫీసర్‌, హెల్త్‌ విజిటర్‌ పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని, ఆశ వర్కర్ల పై పనిభారం తగ్గించి ఆన్‌ లైన్‌ వర్కు రద్దు చేయాలని అంబెడ్కర్‌ విగ్రహం వద్ద జరిగిన ధర్నాలో డిమాండ్‌ చేశారు. ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ళ పద్మ, నగర కార్యదర్శి భారతి, పద్మావతి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, జిల్లా కోశాధికారి మలకా రమణ మాట్లాడుతూ చనిపోయిన ఆశా వర్కర్‌ 37 సంవత్సరాల వయస్సు మాత్రమేనని, ఆమెకు ఇద్దరు పిల్లలు, భర్త ఇటీవలే మంచాన పడి, కుటుంబానికి ఆమేపై ఆధారపడిందన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఆశా వర్కర్లపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వత్తిడి తెస్తు ఎటువంటి సెలవలు ఇవ్వటంలేదని, మెటర్నీటీ సెలవలుకూడా ఇవ్వటంలేదన్నారు. గతంలో కోవిడ్‌కాలం నుండి ఆశా వర్కర్లు మరణిస్తున్నారని ఇటీవలే వత్తిడికి తట్టుకోలేక చిత్తూరు జిల్లాలో ఆశా వర్కర్‌ జానకి మరణించిందని, ఆశా వర్కర్లు వారికి కేటాయించిన కుటుంబాలలోనే పనిచేయాల్సి వున్నాకూడా జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం పేరిట ఇతర ప్రాంతాలలో వీరు పనిచేయాలని అధికారులు తీవ్ర వత్తిడి తీసుకోచ్చారన్నారు. పత్తిపాడు పిహెచ్‌సి పరిధిలో నిన్ననే ఇద్దరు ఆశా వర్కర్లకు మెమోలు ఇచ్చి భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. అధికారుల వత్తిడివలన ఆశా వర్కర్లు అనారోగ్యపాలవుతున్నా పట్టించుకోవడంలేదని విమర్శించారు. కనీస గుర్తింపుకుడా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. డిమాండ్లు పరిష్కరించకపోతే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చెక్కల వేణి, మలకా నాగలక్ష్మి, గుదరిగుంట లక్ష్మీ, అరుణ, మేరీ, ఉమా, రోషిణి, కపవతి, ధనకుమారి, భవాని, సత్యవేణి, సత్యవతి, అమ్ములు తదితరులు పాల్గొన్నారు.