విజయవాడ : టిడిపి అధినేత చంద్రబాబు పిటిషన్లపై విజయవాడ ఎసిబి కోర్టులో ఆయన తరపు లాయర్ దూబే తన వాదనలు వినిపించారు. ప్రస్తుతం విచారణ వాయిదాపడింది. భోజన విరామం తరువాత ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాలకు మళ్లీ వాదనలు ప్రారంభమవుతాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, సిఐడి కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఎసిబి కోర్టులో బుధవారం ఉదయం చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్కుమార్ దూబే వాదనలు వినిపించారు.
''స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవు. అప్పటి ఆర్థికశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారు. ఆమె అధ్యయనం చేశాక సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. ఎలాంటి అభ్యంతరం లేకుండా ప్రాజెక్టు ఆమోదం పొందిందన్న ఆధారాలు ఉన్నాయి. కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్మెంట్ ధరను నిర్ధారించింది. ఆ కమిటీలో చంద్రబాబు లేరు. కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్నారు. సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు ఆయన బెయిల్ను పొడిగించింది. చంద్రబాబుకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేసి ఆ తర్వాత విచారణ చేపట్టారు. రెండు రోజులు కస్టడీలోనూ విచారించారు. ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారు.. ఆ అవసరం ఏముంది ? కేబినెట్ ఆమోదం పొందాకే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది. కేబినెట్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబుపై కేసు ఎలా పెడతారు ?'' అని ప్రమోద్కుమార్ దూబే వాదించారు.










