Nov 20,2023 15:05
  • డిసెంబర్‌ 8 నుండి నిరవధిక సమ్మె దీక్షలు
  • సిఐటియు జిల్లా కార్యదర్శి మనోహర్‌

ప్రజాశక్తి-జమ్మలమడుగు రూరల్‌ : అంగన్వాడి వర్కర్స్‌ను పర్మినెంట్‌ చేసి 26 వేల వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బెల్లం మనోహర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మనోహర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్రలో అంగన్వాడి వర్కర్స్‌ను పర్మినెంట్‌ చేసి గౌరవప్రదమైన వేతనం అది కూడా తెలంగాణ ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి ఇప్పటికి ఇవ్వకపోవడం దారుణం అన్నారు. గర్భిణీలు, బాలింతలకు ఫేస్‌ యాప్‌ ను ఏర్పాటు చేసి ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. కావున వెంటనే రద్దు చేయాలని కోరారు. ఐసిడిఎస్‌కు డబ్బులు కేటాయించి పిల్లల అభివద్ధికి సహకరించాలన్నారు. అంగన్వాడి వర్కర్స్‌ మరియు హెల్పర్స్‌ కు సంక్షేమ పథకాలు వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సెంటర్‌ నిర్వహణకు ప్రతినెల ఒక గ్యాస్‌ సిలిండర్‌ ప్రభుత్వమే సఫరా చేయాలని, మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్ల గా మార్చాలన్నారు. సర్వీస్‌ లో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. చివరగా ఐసిడిఎస్‌ జమ్మలమడుగు ప్రాజెక్టు కార్యదర్శి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పిల్లల అభివద్ధి పథకానికి నిధులు సక్రమంగా కేటాయించకపోవడం వలన పోషకాహార లోపం కొనసాగుతుందన్నారు. అంగన్వాడి విద్యను బలోపేతం చేసి పిల్లలకి యూనిఫాము అమ్మబడి, అమలు చేయాలన్నారు. ప్రభుత్వం మా డిమాండ్లను అంగీకరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తామని సూచించారు. వచ్చే నెల 8న జరిగే నిరవధిక సమ్మెకు మద్దతు తెలపాని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు కే లక్ష్మీదేవి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు విజరు కుమార్‌, సిఐటియు జమ్మలమడుగు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు విజరు, ఏసుదాసులు, అంగన్వాడి వర్కర్స్‌ కమిటీ సభ్యులు హైమావతి, రమాదేవి, సుబ్బ నరసమ్మ, గంగాదేవి, రాజు, దివాకర్‌, ప్రసాద్‌ రెడ్డి, నాగరాజులు పాల్గొన్నారు.