Mar 26,2023 06:32

దేశం వృద్ధి చెందటం లేదని ఎవరూ చెప్పరు. దాని ఫలాలు ఎవరికి దక్కుతున్నాయన్నదే చర్చ. వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగాలు పెరుగుతున్నది కొన్నే. పోనీ పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు చెబుతున్న ఊట సిద్ధాంతం ప్రకారం పెరిగిన సంపదలు దిగువ వారికి చేరుతున్నాయా అంటే చివరికి అచ్చే దిన్‌, తాజాగా అమృత కాలం అని చెప్పిన నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలన తరువాత మన్‌కీ బాత్‌లో కూడా చెప్పే ధైర్యం చేయలేదు.
గత ఏడాది సెప్టెంబరు చివరి వారంలో ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హరూన్‌ ఇండియా రిచ్‌ జాబితా వెల్లడించిన సమాచారం ప్రకారం 2021లో అదానీ కుటుంబం రోజుకు రూ.1,612 కోట్లు, ముకేష్‌ అంబానీ రూ.210 కోట్లు సంపాదించినట్లు పేర్కొన్నది. ఒక దశలో అదానీ కంటే అంబానీ సంపద రూ. రెండు లక్షల కోట్లు ఎక్కువ, అలాంటిది ఏడాది కాలంలోనే అంబానీని వెనక్కు నెట్టి అదానీ మూడు లక్షల కోట్లు ఎక్కువ. అంటే ఏడాదిలో ఐదు లక్షల కోట్లు సంపాదించాడు. అబ్రకదబ్ర, మాయలు మంత్రాలు చేసే గంధర్వులకు, మిత్రమా ఏమి నీ కోరిక, తథాస్తు అనే పైవారు ఉంటే తప్ప మానవ మాత్రులకు సాధ్యమా? 2012లో అంబానీ సంపదతో పోలిస్తే అదానీ దగ్గర ఆరో వంతు మాత్రమే ఉంది. 2014లో కేవలం ఎనిమిది బిలియన్‌ డాలర్ల సంపద ఉన్న అదానీ 2022 నాటికి 137 బి.డాలర్లకు ఎదిగారు. వందల సంవత్సరాలుగా ఆ రంగంలో ఉన్నవారికి సాధ్యం కానిది ఇంత స్వల్పకాలంలో అదానీకి ఎలా వచ్చింది, ఇతరులకు ఎందుకు రాలేదు అన్నది ప్రశ్న. బ్లూమ్‌బెర్గ్‌ తాజా బిలియనీర్ల జాబితా ప్రకారం ఈ ఏడాది జనవరి 24న 119 బి.డాలర్ల సంపద ఉన్న అదానీ ఇప్పుడు 57.2 బి.డాలర్లకు దిగజారారు. హరూన్‌ సంస్థ అంచనా 53 బి.డాలర్లుగా ఉంది. ముకేష్‌ అంబానీ 82 బి.డాలర్లతో అగ్రస్థానంలో ఉన్నారు.
దేశంలో జనవరిలో 7.14 శాతంగా ఉన్న నిరుద్యోగం ఫిబ్రవరిలో 7.45 శాతానికి పెరిగిందన్న సిఎంఐఇ సమాచారాన్ని ఫైనాన్సియల్‌ టైమ్స్‌ ఉటంకించింది. నైపుణ్య శిక్షణ పథకాన్ని మన్మోహన్‌ సింగ్‌ కాలంలోనే ప్రారంభించారు. దానికి ఒక మంత్రిని ఏర్పాటు చేసి, కేటాయింపులను పెంచి అసలు దానికి ఆద్యుణ్ణి తానే అన్నట్లుగా నరేంద్ర మోడీ ప్రచారం చేసుకున్నారు. నిజం ఏమిటి ? ''మనది ప్రధానంగా కార్పొరేట్‌ వృద్ధి మాత్రమే. ఒక యూనిట్‌ ఉత్పాదనకు భారత కార్పొరేట్లు ఎక్కువ మంది జనాలను నియమించటం లేదు. ఒకవైపు యువతకు ఉద్యోగాలు రావటం లేదు. మరోవైపు తమకు నిపుణులైన జనాలు దొరకటం లేదని కంపెనీలు ఫిర్యాదు చేస్తున్నాయి. జీవితకాల ఉపాధికి ప్రభుత్వ ఉద్యోగం అవసరమని ఆకాంక్షిస్తున్నారు. నూట నలభై కోట్ల మంది జనాభాతో పోలిస్తే అవి చాలా తక్కువ.'' అని ప్రణాళికా సంఘ మాజీ ప్రధాన సలహాదారు ప్రణబ్‌ సేన్‌ చెప్పినట్లు కూడా ఆ పత్రిక పేర్కొన్నది. ''నైపుణ్యాలు దొరకటం మరొక సమస్య. అనేక కంపెనీలు ఇప్పటికే డిమాండ్‌ ఉన్న నైపుణ్యాలను వృద్ధి చేసుకున్న వారిని తీసుకుంటున్నాయి. భారత్‌లో ఫైనాన్స్‌, బీమా, రియల్‌ ఎస్టేట్‌, పొరుగు సేవలు, టెలికాం, ఐ.టి రంగాలలో ఎక్కువ వృద్ధి ఉంది. కానీ ఇవి ఉపాధిని సృష్టించేవి కాదు'' అని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ అర్థశాస్త్ర ఫ్రొఫెసర్‌ అమిత్‌ భోసలే చెప్పినట్లు కూడా ఆ పత్రిక పేర్కొన్నది.
భారత్‌లో ఉపాధి సమస్య పరిష్కారం కావాలంటే ఇరవై సంవత్సరాల పాటు వార్షిక వృద్ధి రేటు పద్దెనిమిది శాతం ఉండాలని ఐదేళ్ల క్రితం ప్రపంచబాంకు అంచనా వేసింది. చిత్రం ఏమిటంటే తన విధానాలతో ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా జిడిపి వృద్ధి రేటును తమ ప్రభుత్వం సాధిస్తున్నట్లు మోడీ సర్కార్‌ చెప్పుకుంటున్నది. మోడీ అధికారానికి వచ్చిన తొలి సంవత్సరాల్లో ఐదు శాతానికి అటూ ఇటూగా ఉన్న నిరుద్యోగ రేటు ప్రస్తుతం 7-8 శాతం మధ్య ఉంటున్నది. శ్రామిక శక్తి భాగస్వామ్య అంశంలో రెండు వందల దేశాల సమాచారాన్ని గ్లోబల్‌ ఎకానమీ డాట్‌ కామ్‌ విశ్లేషించింది. దాని ప్రకారం 2021లో 87.3 శాతంతో కతార్‌ ఒకటవ స్థానంలో ఉంది. మన దేశంతో సమంగా జనాభా ఉన్న చైనా 68.6 శాతంతో 42వది కాగా మన దేశం 45.57 శాతంతో 159వ స్థానంలో ఉంది. కరోనా కాలంలో 40 శాతం లోపుకు పడిపోయింది. ఇరవై-ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సు వారిలో 2022 అక్టోబరులో పట్టణ నిరుద్యోగం 42 శాతం ఉండగా అదే చైనాలో 16-24 తరగతిలో 18శాతమే ఉంది. ప్రస్తుతం దేశంలో 30 ఏళ్ల లోపు వారు సగం మంది ఉన్నారు. అంటే ఉపాధి అవసరం ఎంత ఉందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.ఇప్పుడున్న ధోరణుల ప్రకారం 2040 నాటికి 59 ఏళ్లు పైబడిన వారు దేశంలో ఎక్కువ మంది ఉంటారని అంచనా. 2024లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది చివరి నాటికి పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఇవన్నీ సంవత్సరాల తరబడి నింపకుండా ఉంచిన ఖాళీలు. మెకెన్సీ సంస్థ అంచనా ప్రకారం 2030 నాటికి దేశంలో తొమ్మిది కోట్ల మేరకు వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది.
దేశంలో ఉపాధి రహిత వృద్ధి ఆందోళన కలిగిస్తోందని, వృద్ధికి అనుగుణంగా ఉపాధి పెరగటం లేదని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా కూడా చెప్పారు. అమెరికాలో కార్మిక శక్తి భాగస్వామ్యం 62 శాతం కాగా మన దేశంలో 40 శాతమని (2022) చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2020 ఆర్థిక సర్వేలో 2025 నాటికి మంచి వేతనాలు ఉండే ఉద్యోగాలను నాలుగు కోట్లు, 2030 నాటికి ఎనిమిది కోట్లు కల్పించ గలమని, చైనా తరహా వృద్ధి విధానాన్ని అనుసరిం చాలని కూడా దానిలో పేర్కొన్నారు. దేశంలోని పెద్ద పట్టణాల్లో స్విగ్గి, జొమాటో వంటి కాలక్షేప ఉద్యోగాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. గ్రామాల్లో అలాంటి అవకాశాలు కూడా ఉండటం లేదు. వృద్ధికి అనుగుణంగా ఉపాధి లేదు. ఉన్న ఉపాధికి పొందుతున్న వేతనం కూడా నామ మాత్రంగా ఉంది. తగినంత వేతనం లేకుండా కొనుగోలు శక్తి పెరగదు. స్థానిక కొనుగోలు శక్తి పెరుగుతున్న కారణంగానే ఎగుమతి మార్కెట్లో తేడాలు వచ్చినా చైనా తట్టుకోగలుగుతోంది. మన దేశంలో ఆ పరిస్థితి ఉందా?
కార్పొరేట్లకు అమృతకాలం, అచ్చే దిన్‌, దేశ యువత భవిష్యత్‌కు ముప్పు. ఇది నేటి పరిస్థితి. పోతే, కాంగ్రెస్‌ 50 సంవత్సరాల్లో చేయలేని వాటిని తాను ఐదు సంవత్సరాల్లోనే చేసినట్లు 2019 ఎన్నికల్లో నరేంద్ర మోడీ చెప్పుకున్నారు. దిశ, దశ తెలుసుకొనేందుకు తొమ్మిదేళ్లు తక్కువ కాదు. దేశాన్ని ఎటు తీసుకుపోతున్నారో, ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలోకి నెట్టారు. ఎన్నికల వాతావరణం ఏర్పడింది కనుక దీని గురించి మోడీ భక్తులు ఎలా స్పందిస్తారో చెప్పనవసరం లేదు. నిజానికి ఇది నరేంద్రమోడీ వ్యక్తిగత సమస్య కాదు. తమది కాంగ్రెస్‌కు భిన్నమైన పార్టీ అని జనాన్ని నమ్మించేందుకు చేసిన ప్రచారం తప్ప వాజ్‌పేయి ఏలుబడిలో గానీ ఇప్పుడు నరేంద్ర మోడీ పాలనలో అనుసరిస్తున్న దివాళాకోరు విధానాలు గానీ గతంలో కాంగ్రెస్‌ ప్రవేశపెట్టినవే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) మన దేశం మీద రుద్దిన విధానాలకు భారతీయ ముద్ర వేసి మరీ అమలు జరుపుతున్న ఫలితమే. అయితే కాంగ్రెస్‌కు బిజెపికి తేడా లేదా అంటే ఉంది. ఆర్థిక విధానాల వైఫల్యాలకు తోడు గోబెల్స్‌ సమాచారాన్ని జనాలకు అందించే వాట్సాప్‌ విశ్వ విద్యాలయం, మత విద్వేషాన్ని బిజెపి బోనస్‌గా ఇచ్చింది కదా!

mkr

 

 

 

 

 

ఎం. కోటేశ్వరరావు