ప్రజాశక్తి- నందిగామ (ఎన్టిఆర్జిల్లా) : నందిగామ పట్టణంలో ఎమ్ఆర్ఆర్ కళాశాల వద్ద ఎంఈడి విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఎంఈడి సప్లమెంటరీ పరీక్షలకు ఫీజులు కట్టామని, అయినా యాజమాన్యం సక్రమంగా స్పందించక పోవడంతో హాల్ టికెట్లు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ఎంఈడి పరీక్షలు జరుగుతున్నాయని పరీక్ష కేంద్రం వద్దకు వెళ్తే హాల్ టికెట్లు తీసుకుని వస్తే పరీక్షలు వ్రాస్తామని తెలిపారని వాపోయారు. ఎంఆర్ఆర్ కళాశాల వద్దకు వెళ్లి హాల్ టికెట్లు అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, ముందుగా ఫీజ్ లు చెల్లించామని కేరళ, కర్ణాటక, తెలంగాణ వివిధ సుదూర ప్రాంతాల నుంచి పరీక్షలు రాద్దామని వచ్చామని తెలిపారు. ఎమ్ఆర్ఆర్ కళాశాల యాజమాన్యం హాల్ టికెట్లు ఇవ్వకపోవడంతో మా జీవితం అంధకారంలో వెళ్లే పరిస్థితి నెలకొందని విద్యార్థులు వాపోయారు. కళాశాల యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.










