అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ సమావేశంలో పలు కీలకమైన బిల్లులకు ఎపి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు ఆమోదం. ఉద్యోగి రిటైర్డ్ అయిన సమయానికి ఇంటి స్థలం లేనివారికి కచ్చితంగా ఇంటి స్థలం ఉండాలి. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్ అయ్యేలా చూడాలి. వారి పిల్లల చదువులు కూడా ఫీజు రియింబర్స్ మెంట్ కింద ఉండి ప్రయోజనాలు అందేలా చూడాలి. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పథకం ఏర్పాటుకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ఎపి వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లును ఆమోదించింది. ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణపై బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రఖ్యాత యూనివర్శిటీలతో సంయుక్త సర్టిఫికేషన్ ఉండేలా చట్ట సవరణ చేసింది. ఇందులో చదువుతున్న విద్యార్థుల డిగ్రీలకు జాయింట్ సర్టిఫికేషన్ ఇవ్వనుంది. ప్రైవేటు యూనివర్శిటీల్లో కూడా నాణ్యత ఉండేలా చర్యలు చేపట్టాలని, ఈ మార్పుల వల్ల పిల్లలకు మంచి జరుగుతుందని తెలిపింది. ఇంతకుముందు ఉన్న ప్రైవేటు యూనివర్శిటీలు, కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేటు యూనివర్శిటీలకు ప్రపంచంలోని టాప్ 100 యూనివర్శిటీలతో టై అప్ ఉండేలా చట్ట సవరణ చేపట్టాలని, దీనివల్ల జాయింట్ సర్టిఫికేషన్కు వీలు కలుగుతుందని, ఇప్పుడు నడుస్తున్న ప్రైవేటు కాలేజీలు యూనివర్శిటీలుగా మారితే వచ్చే అదనపు సీట్లలో 35శాతం సీట్లు కన్వీనర్ కోటాలోకి వస్తాయని, దీనివల్ల పిల్లలకు మేలు జరుగుతుందని కేబినెట్ అభిప్రాయపడింది. కురుపం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు, పీఓటీ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుకి, దేవాదాయ చట్ట సవరణ బిల్లుకి కేబినెట్ ఆమోదం తెలిపింది.










