
మణిపూర్ ఘోర దురంతాలపై ప్రకటన చేయడానికి, చర్చ జరపడానికి నిరాకరిస్తున్న ప్రధాని మోడీ వైఖరితో పార్లమెంటు విలువైన కాలం వృథా అయిపోతున్నది. మణిపూర్ పుత్రికలపై జరిగిన అమానుషానికి దేశమంతా సిగ్గుపడాలని చెప్పిన మోడీ అదే మాట సభలో చెప్పడానికి సిద్ధం కాకపోవడం ఇందుకు కారణమైంది. చర్చకు మొహం చాటేస్తున్న మోడీని దారికి తేవడానికి, మణిపూర్తో సహా దేశ పరిస్థితిని సాకల్యంగా చర్చించడానికి ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంతో ఈ ఎత్తుగడకు బ్రేక్ పడింది. నోటీసును ఆమోదించి కూడా చర్చకు సమయం నిర్ణయించకుండా కాలయాపన చేయడంలో బిజెపి సర్కారు డొల్లతనం వెల్లడైపోయింది. తాము చర్చకు సిద్ధంగా వున్నా ప్రతిపక్షాలు ముందుకు రాలేదని హోంమంత్రి అమిత్ షా ఆరోపించడం ఇందులో భాగమే. వాస్తవానికి ఈ వ్యవహారంలో రెండవ ప్రధాన పాత్రధారి అమిత్ షానే, హోంమంత్రిగానూ, ఈశాన్య రాష్ట్రాలలో బిజెపి బాధ్యుడుగానూ ఆయనకు కీలకమైన బాధ్యత వుంది. మహిళలపై సామూహిక అత్యాచారం మే 3-4 తేదీల్లో జరిగితే మరో పదిహేను రోజుల తర్వాత పర్యటనకు వెళ్లింది ఆయనే, ఇప్పుడు తెలియవస్తున్న సమాచారం ప్రకారం అప్పటికే ఆ దారుణ ఘటనపై పోలీసు స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధితులే వచ్చి ఫిర్యాదు చేశారు. ఒక కల్లోలిత రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కూడా పరిస్థితి తెలుసుకోలేకపోవడం హోం మంత్రి అసమర్థతకు అద్దం పడుతుంది. నిఘా సంస్థలకు ఆధ్వర్యం వహించే మంత్రికి ఈశాన్య రాష్ట్రంలో ఎగుస్తున్న మంటలు కనిపించలేదంటే ఎలా విశ్వసించడం? అక్కడకు పర్యటనకు వెళ్లినప్పుడైనా ప్రభుత్వం, పోలీసు శాఖ, నిఘా వర్గాలు చెప్పలేదా? వందల సంఖ్యలో జరిగితే ఇదొక్కటి పట్టుకుంటారేమని నిస్సిగ్గుగా వాదించిన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చెప్పలేదా? ఈశాన్య చాణక్యుడుగా చెప్పుకునే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నివేదించలేదా? ఇంతకన్నా ఆత్మవంచన మరేముంటుంది? అలా అయితే ఇందుకుగాను హోంశాఖ అధికారులు అమాత్యులపై చర్య తీసుకోవద్దా?
- వీడియో తీసిన వారి అరెస్టు
ఈ ఘటనతో పాటు మణిపూర్లో జరిగిన మరెన్నో అఘాయిత్యాల బాధాకర వివరాలు ఇప్పుడు బయటికొస్తున్నాయి. వాటిపై ఏ చర్యలూ తీసుకున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు, దేశవ్యాపితంగా ఇంతగా ఆగ్రహావేశాలు రగిలించిన ఈ కేసులోనే కేంద్రం చేసిందేమిటి? ఆ రోజు వీడియో తీసిన వ్యక్తిని అరెస్టు చేశారట! జరిగింది షూట్ చేసి దేశమంతా అందుబాటులోకి తెచ్చినందుకు కేసు నమోదు చేశారట. ఇదేగాక ఇలాంటి ఘటనలు ఎలా ఎన్ని జరిగాయో దర్యాప్తు చేసే బాధ్యత సిబిఐకి అప్పగించారట! ఏదో సామెత చెప్పినట్టు సిబిఐ, ఐ.బి, రా వంటి సంస్థలు సక్రమంగా పనిచేస్తే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? పైగా పంజరంలో చిలకగా పేరుమోసిన సిబిఐ ఇలాంటి వాటిని సమర్థంగా వెలికితీసిన ఉదాహరణ ఒకటైనా వుందా? అన్ని సందర్భాల్లోనూ మారణకాండ జరిగిన తర్వాతనే కదా సిబిఐ రంగంలోకి వచ్చేది? ఈ విషయమైనా ప్రభుత్వం పార్లమెంటుకు చెప్పలేదు. సుప్రీం కోర్టులో అఫిడవిట్ ద్వారా తెలియజేసింది. మీరు చర్య తీసుకుంటారా లేక మేమే రంగంలోకి దిగాలా అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై.చంద్రచూడ్ అక్షింతలు వేశాక అనివార్యంగా ఇచ్చిన జవాబిది. సుప్రీంకోర్టు ఇలా అడగడం కూడా ఇష్టం లేని బద్రి శేషాద్రి అనే తమిళ పాత్రికేయుడు యూట్యూబ్ ఇంటర్వ్యూలో సిజెఐ పైనే అవాకులకు దిగారు. ప్రధాన న్యాయమూర్తికి ఒక తుపాకి ఇచ్చి పంపిస్తే ఘర్షణలను నివారిస్తారేమో చూడాలని అపహాస్యం చేశారు. అది పర్వతమయమైన సంక్లిష్ట ప్రాంతం. అక్కడ హత్యలు జరుగుతాయి. హింసాకాండ మనం ఆపలేం అని తేల్చిపారేశాడు. దీని మీద కవిఅరసు అనే అడ్వకేట్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో ఎందరో రచయితలు, పాత్రికేయులను నిరంకుశంగా అరెస్టు చేసిన బిజెపికి ఇది మాత్రం మహాపరాధమైపోయింది. తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై వెంటనే తీవ్రంగా ఖండించేశారు. అంటే అక్కడ ఆదివాసులపై దాడులను, ఈశాన్యంలో అంతర్యుద్ధాన్ని ఆపకపోగా దేశ ప్రధాన న్యాయమూర్తినే అపహాస్యం చేసిన వ్యక్తిని విచారించకూడదన్నమాట. ప్లాటినం తరహా ఖనిజాలతో పాటు అపార సంపదలకు నిలయమైన ఆ ప్రాంతాన్ని బడా కంపెనీల పాలు చేయడానికే కావాలని కల్లోలం సృష్టించినట్టు కూడా మీడియా సంస్థలసు పేర్కొంటున్నాయి.
- వంకర వాదనలతో పక్కదారి
మణిపూర్పై మాట్లాడేబదులు అలవాటైన అధ్వాన్న వ్యూహాలన్నిటినీ అమ్ముల పొదిలోంచి తీసింది బిజెపి. బెంగాల్, రాజస్థాన్లలో మహిళలపై ఇలాంటి ఘటనలే జరిగాయని పోటీ పెడుతోంది. బెంగాల్లో జరిగిన ఘటనలను మొన్న ఇదే పేజీలో చర్చ చేశాం. ఆ కుట్రలో బిజెపికి కూడా వాటా వుంది. అదలా వుంచితే అమానుషాలను నివారించడానికి బదులు ఒకదానికి ఒకటి పోటీ పెట్డడం ఏం రాజనీతి? ఇంకోటి మయన్మార్ను చైనాను ఇందుకు కారణంగా నిందించడం. మయన్మార్ సైనిక పాలకుల అణచివేత కారణంగా శరణార్థులు వచ్చి తలదాచుకుంటున్న మాట నిజమే. కాని మైతేయి, కుకీ తెగల మధ్య బిజెపి సృష్టించిన అంతర్యుద్ధానికి వారెలా కారణమవుతారు? ఇక భారత మాజీ సైన్యాధికారి నవరత్నే ఏకంగా చైనానే వీటన్నిటికీ కారణమని తేల్చిపారేశారు! ఒకవైపున విదేశాంగ మంత్రి జైశంకర్ అంతకు ముందు మోడీ చైనా నేతలతో చర్చలు జరిపి సంబంధాల మెరుగుదల గురించి మాట్లాడుతూ మాజీ సైన్యాధిపతి ఇలా అనడం దానికి విస్తారమైన ప్రచారం కల్పించంలో విదేశాంగ నీతీ కనిపించదు. బిజెపికి కేంద్రానికి కావలసింది ఈ గండం నుంచి గట్టెక్కడమే. అందుకు మార్గం ఇతరులపై దాడి చేయడం, చర్చను దారి మళ్లించడం. వాస్తవానికి మణిపూర్ అంటున్నా ఈ జ్వాలలు ఈశాన్యమంతటినీ కబళించే ప్రమాదం వుందని గతవారం ఈ శీర్షికలో చెప్పుకున్నాం. మిజోరాం ముఖ్యమంత్రి ఇప్పటికే పలురకాల నిరసనలలో, ఆందోళనలలో పాల్గొన్నారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఇది తమ భద్రతకు కూడా ముప్పని హెచ్చరించారు. మిజోరాంలో కుకి, జో ఉపజాతి ప్రజలు అధికంగా వుంటారు. అక్కడ శరణార్థి శిబిరాలు నిర్వహించడం కూడా బిజెపి సహించలేకపోతున్నది. వీటన్నిటినీ అస్సాంకు తరలించాలని కేంద్రం ప్రతిపాదించడం అందుకే. అయితే అస్సాం ముఖ్యమంత్రి హిమంత ఈశాన్య కల్లోలం సూత్రధారులలో ఒకరు. సరిహద్దు రాష్ట్రాలన్నిటితో దానికి తగాదాలున్నాయని గుర్తుచేసుకుంటే ఇదెంత ప్రమాదకరమైన సూచనో స్పష్టమవుతుంది. హిందూ ముస్లిం తగాదాలను ఇతర జాతి కలహాలను రాజేయడంలో అస్సాంకు దారుణమైన చరిత్ర వుంది. పాలనా పరంగానూ ప్రజాస్వామిక చర్చలతోనూ సమస్యను పరిష్కరించే బదులు రాజకీయ కోణంలో ఉపయోగించుకోవడమే బిజెపి పరమ సూత్రంగా వుందని ఈ ఉదాహరణలన్నీ విశదం చేస్తాయి. అత్యాచారానికి గురైన మహిళలను సాటి మహిళలే పట్టించారని మరో విపరీత వాదన కూడా పాలక పార్టీ ప్రచారంలో పెట్టింది. విద్వేషాలు రగిలించిన తర్వాత ఎవరు ఏం చేస్తారో ఎవరు చెప్పగలరు? అందులోనూ మైతేయి ప్రజలను కుకీల పైకి ఉసిగొల్పిన తర్వాత.. మైదాన ప్రాంత ప్రజలను కూడా గిరిజనులుగా గుర్తించాలని ఇంఫాల్ హైకోర్టు బాధ్యతా రహితంగా ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కూడా తప్పు పట్టింది, అయినా రాష్ట్ర ప్రభుత్వం బిజెపి నాయకత్వం ఆమోదించాయి. ఆ రాష్ట్రంలోనేగాక మొత్తం ఈశాన్యంలో రాజకీయ మద్దతు పెంచుకోవడానికి ఆడిన నాటకమే ఇంతటి విపత్కర పరిస్థితికి కారణమైంది. ఇప్పుడు మరెవరిపైనో నిందలా?
- ప్రతిపక్షాల ప్రతిఘటన, వైసిపి టిడిపి వంత
ఒకవైపు ఇంత దారుణమైన నిందలేస్తూనే అమిత్ షా ఉభయ సభల్లో ప్రతిపక్ష నాయకులైన మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌదరిలకు లేఖలు రాస్తారు. చర్చకు సహకరించాల్సిందిగా లేఖలు రాయడం కన్నా కపటం ఏముంటుంది? ఖర్గే అన్నట్టు ఒకవైపున మోడీ ప్రతిపక్షాలను దేశ వ్యతిరేక శక్తులతోనూ టెర్రరిస్టులతోనూ పోల్చి మాట్లాడుతూ మరోవైపున ఇలాంటి మెత్తటి లేఖలు ప్రయోగిస్తే ఫలితం ఏముంటుంది? ప్రతిపక్షాలు ఇండియా అని తమ కూటమికి పేరు పెట్టుకున్నారు గాని ఇండియన్ ముజహదీన్లోనూ ఈస్టిండియా కంపెనీలోనూ కూడా ఇండియా వుందని అవహేళన చేసిన మోడీ మాటలు దేన్ని సూచిస్తాయి? నిజానికి చర్చ సంగతి అటుంచి పార్లమెంటులో మణిపూర్పై వేసిన ప్రశ్నలకు కూడా ఈ అంశం కోర్టు పరిధిలో వుందంటూ సమాధానాలు ఇవ్వకుండా తిరస్కరిస్తున్నారు. నేను మూడోసారి అధికారంలోకి వచ్చాక దేశాన్ని మూడో ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని ప్రధాని ప్రగల్భాలు పలుకుతున్నారు. సహజంగా భారత దేశం పెద్ద దేశంగా ఇప్పుడు అయిదో స్థానంలో వుంది. అయితే మనకన్నా చైనా ఆరు రెట్లు పెద్ద ఆర్థిక వ్యవస్థగా పెంపొందుతున్నది. అయిదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ కావడమే పెద్ద గొప్ప విషయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకున్న రోజులు ఎవరూ మర్చిపోరు. ఇప్పటికీ కూడా మన ఆర్థిక వ్యవస్థ 3.2 ట్రిలియన్లు దాటలేదు. చైనా 17.3 ట్రిలియన్ల దగ్గర దూసుకుపోతున్నది. జిడిపి గొప్పలు అలా వుంచి తలసరి ఆదాయంలో మన వెనుకబాటును, అంతులేని అసమానతలను విమర్శకులు మోడీకి సరిగానే గుర్తు చేశారు.
పరిస్థితికి సంబంధించిన పూర్తి నిజాలు దేశానికి తెలియడం కోసం ప్రతిపక్ష పార్టీలకు చెందిన 21 మంది ఎంపీలు మణిపూర్లో స్వయంగా పర్యటన చేస్తున్నారు. దీనివల్ల అక్కడ పర్యటించకుండా దాటేసిన మోడీ తీరుకు అది సమాధానమూ అవుతుంది. ఇంత కీలకమైన సమయంలో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పాలక పార్టీలైన వైసిపి, తెలుగుదేశం బిజెపికి అనుకూలంగా వ్యవహరించడం అవకాశవాదానికి పరాకాష్ట. ఎ.పి కీ అనేక విధాల అన్యాయం చేసిన మోడీ సర్కారును నిలదీయడానికి ఈ అవకాశం ఉపయోగించుకునే బదులు అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించాలని వైసిపి నిర్ణయించింది. అమిత్షా చెప్పిందే సరైందని ప్రతిపక్షం వైఖరి తప్పని ఆ పార్టీ నేత విజయ సాయిరెడ్డి ప్రవచించారు. ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లుపైనా మద్దతు ప్రకటించారు. టిడిపి ఎం.పి గల్లా జయదేవ్ మొదట్లో బలపరుస్తామని సూచించారు. అయితే ఎన్డిఎలో చేరుతామన్నా చేర్చుకోలేదని, అధికార పూర్వకంగా తమ మద్దతు కోరలేదని ఆపార్టీ కొంత సమయం తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇంతవరకూ మణిపూర్ విషయంలో కేంద్రాన్ని బిజెపిని పల్లెత్తు మాట అన్నది లేదు. కొంత జాప్యం వ్యూహం అనుసరిస్తున్నా టిడిపి ప్రతిపక్షాలతో ఓటు చేస్తుందన్న అంచనా ఎవరికీ లేదు. కాంగ్రెస్తో కలసి వేదిక పంచుకోబోమన్న బిఆర్ఎస్ మాత్రం వ్యతిరేకంగా వుంటాననే చెబుతున్నది. ఏది ఏమైనా ప్రభుత్వం పడిపోయే ముప్పు లేకున్నా ఈ అవిశ్వాస పర్వం అయిదు రాష్ట్రాల ఎన్నికల తరుణంలో బిజెపికి పెద్ద రాజకీయ సవాలుగానే మారింది.
తెలకపల్లి రవి