Jan 26,2022 08:22

- బడా కంపెనీల నుంచి అత్యధికం!
న్యూఢిల్లీ : 
మోడీ సర్కార్‌ అమల్లోకి తెచ్చిన 'ఎన్నికల బాండ్ల' వ్యవహారంపై అనుమానాలు బలపడుతున్నాయి. రూ.వెయ్యి, రూ.10వేలు, రూ.లక్ష, రూ.10లక్షలు, రూ.కోటి..విలువజేసే బాండ్లను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల రాజధానుల్లో అమ్మకానికి పెడుతున్నారు. ఎవ్వరైనా ఎస్‌బీఐ శాఖల్లో ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఇప్పటివరకు జరిగిన వివిధ బాండ్ల అమ్మకాల్లో రూ.కోటి విలువజేసేవి 92శాతం వరకూ ఉన్నాయి. సామాన్యులు, ఆయా పార్టీల మద్దతుదారులు రూ.కోటి చెల్లించి బాండ్లు కొనుగోలు చేయరని, బడా కార్పొరేట్‌ కంపెనీలే అధికార బీజేపీకి వేల కోట్ల విరాళాలు అందజేస్తున్నాయని ఆరోపణలున్నాయి. ఈ విరాళాలు అందజేసినందుకుగానూ కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలంగా ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందుతున్నా యని సమాచారం! ఆర్టీఐ కార్యకర్త, సామాజికవేత్త లోకేశ్‌ బాత్రా తాజాగా మీడియాకు విడుదల చేసిన సమాచారం ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.
ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం, బడా కార్పొరేట్‌ కంపెనీలు పెద్ద మొత్తంలో (రూ.1కోటి విలువైన బాండ్లు) అధికార బీజేపీకి ఎన్నికల బాండ్ల పథకం ద్వారా విరాళాలు అందజేస్తున్న విషయం తెలిసిందే. 2018 నుంచి ఇప్పటివరకూ 19 దఫాలుగా ఎన్నికల బాండ్ల అమ్మకానికి కేంద్రం తెరలేపింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మొదలవుతున్నవేళ ఈ ఏడాది జనవరి 1-10 వరకు బాండ్ల కొనుగోళ్లను అవకాశం కల్పించింది.

గత నాలుగేండ్లలో 15,420 ఎన్నికల బాండ్లను అమ్మగా రూ.7,995కోట్ల విరాళాలు వివిధ రాజకీయ పార్టీలకు వెళ్లాయి. రూ.కోటి విలువజేసే బాండ్లు 92శాతం ఉన్నాయి. వీటి విలువ రూ.7405కోట్లు. మిగతా 8శాతం బాండ్లలో రూ.10లక్షలు, రూ.లక్ష, రూ.10వేలు, రూ.వెయ్యి విలువజేసేవి ఉన్నాయి. ఇందులో అత్యధికం అధికార బీజేపీకే దక్కాయన్నది తెలిసిందే.