ప్రజాశక్తి - రెడ్డిగూడెం (ఎన్టిఆర్) : గత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట సచివాలయం పరిధిలోని సీతారాంపురం తండాలో ఆయన మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నేరావుపేట సచివాలయం పరిధిలో వైయస్సార్ పెన్షన్ కానుక, రైతు భరోసా ఆసరా, అమ్మఒడి, చేయూత, విద్యాదీవెన ఆరోగ్యశ్రీ, వసతి దీవెన, సున్నా వడ్డీ, వాహనమిత్ర, పంటల బీమా పథకం, ఆరోగ్య ఆసరా, కాపు నేస్తం, చేదోడు, రైతులకు సున్నా వడ్డీ పథకం, ఈబీసీ నేస్తం, జగనన్న తోడు, ఇన్ పుట్ సబ్సిడీ తదితర పథకాల అమలుకు ఇప్పటివరకు రూ.9,87,62,897 లను లబ్ధిదారులకు చెల్లించినట్లు వెల్లడించారు. అన్నేరావుపేటలో సచివాలయం, వెల్ నెస్ సెంటర్, ఆర్.బి.కె నిర్మాణాలు, డిజిటల్ లైబ్రరీ, నాడు-నేడు కింద అభివృద్ధి పనులకు, సీసీ డ్రెయిన్లకు, రహదారుల నిర్మాణానికి మొత్తం రూ.5,53,48,572లు మంజూరు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమంతో పాటు అభివద్ధి కూడా పెద్దపెట్టవేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.










