Oct 28,2023 00:03

8న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌


8న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో విద్యార్థి, యువజన సంఘాల నేతలు
ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ : కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈనెల 8వ తేదీ బంద్‌ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి యువజన సంఘాల నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బైరాగిపట్టెడలోని జిఎస్‌కె భవన్‌లో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని బండి చలపతి (ఏఐఎస్‌ఎఫ్‌) అధ్యక్షతన నిర్వరహించారు. ఈసందర్బంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి కత్తిరవి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మాధవ్‌కష్ణ, పిడిఎస్‌యు మహేష్‌, ఎన్‌ఎస్‌యుఐ జావిద్‌, ఆమ్‌ఆద్మీ నగేష్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ పట్ల కేంద్ర ప్రభుత్వం ధ్వందవైఖరిని వ్యవహారిస్తుందని, రాష్ట్రంలోని ప్రభుత్వరంగ సంస్థలాన్నిటిని ప్రైవేటీకరణ చేస్తుందన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం 8న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ జయప్రదం చేయాలని విద్యార్థి యువజన నాయకులు పిలుపునిచ్చారు. అనేక త్యాగాలతో విద్యార్థి యువజన నాయకుల 32మంది ప్రాణత్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకోవడాన్ని నిరసిస్తూ జరుగుతున్న పోరాటం నవంబర్‌ 8 నాటికి వెయ్యి రోజులు అవుతున్న సందర్భంగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడంతో పాటు నవంబర్‌ 8వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కి పిలుపునిచినట్లు తెలిపారు. లాభాలు వస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపయోగపడుతున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈనెల 31న సీపీఎం కార్యాలయంలో పోస్టర్లు విడుదల, నవంబర్‌ రెండు, మూడు తేదీల్లో విద్యాసంస్థలకు నోటీసులు అందచేయటం, నవంబర్‌ 5న ప్రయివేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌తో సమావేశం, 6న టాన్‌లో బైక్‌ర్యాలీ నిర్వహిస్తామని తెలియచేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు సుందర్‌ రాజు, ఓంరాజ్‌, హరికష్ణ, సురేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రవి, అక్బర్‌, ప్రసన్న, అశోక్‌, శీను, డివైఎఫ్‌ఐ నాయకులు సురేష్‌, అజరు, ఆమ్‌ఆద్మీ విద్యార్ధి విభాగం జగదీష్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షులు రామకష్ణ, శ్రీను పాల్గొన్నారు.