- సంయుక్త కిసాన్మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ పిలుపు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబరునెల 26,27,28 తేదీలలో విజయవాడలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్మోర్చా-కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. మహాధర్నా నిర్వహణకు ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ సమావేశం మంగళ వారం విజయవాడ ప్రెస్క్లబ్లో జరిగింది. ఈ సమావేశానికి సం యుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనరు వడ్డే శోభనాద్రీశ్వర రావు అధ్యక్షత వహిం చారు. ఈ సమా వేశంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి గురునాథ రావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ నరసింహారావు, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్ను స్టీరింగ్ కమిటీలోకి అదనంగా తీసుకోవాలని నిర్ణయించారు.
మహాధర్నా నిర్వహణకు గానూ ప్రచార కమిటీ, ఏర్పాటు కమిటీ, సోషల్ మీడియా కమిటీలను ఏర్పాటుచేశారు. ఈ నెల 30లోపు అన్ని జిల్లాల్లో రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, జాయింట్ సమావేశాలు నిర్వహించాలని, అన్ని జిల్లాలకూ కేంద్ర, రాష్ట్ర నాయకత్వం హాజరవ్వాలని నిర్ణయించారు. ఢిల్లీలో జరిగిన అఖిలభారత రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్ల సమావేశంలో ప్రకటించిన డిక్లరేషన్ కాపీలను, మహాధర్నా కరపత్రాలను ముద్రించి విస్తృతంగా పంపిణీ చేయనున్నారు.
సమావేశం అనంతరం స్టీరింగ్ కమిటీ నాయకత్వాన విజయవాడ నార్త్ ఎసిపి రవికాంత్ను కలుసుకుని మహాధర్నాకు అనుమతి గురించి చర్చించారు. ఈ సమావేశంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్, రైతు సంఘం నాయకులు వై కేశవరావు, రైతు కూలీ సంఘం కార్యదర్శి ఎస్ ఝాన్సీ, నాయకులు చుండూరు రంగారావు, చిట్టిపాటి వెంక టేశ్వర్లు, నర్సింగరావు, రవీంద్రనాథ్, కుర్రా నరేంద్ర, ఎవి నాగేశ్వరరావు, వెంకటసుబ్బయ్య, కె ధనలక్ష్మి పాల్గొన్నారు.










