ప్రజాశక్తి-గ్రేటర్ విశాఖ బ్యూరో : ఈనెల 21న వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం వెల్లడించారు. రాష్ట్రంలో రాగల 48 గంటల్లో రాయలసీమ ప్రాంతంలో కొద్దిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలకు అవకాశాలున్నాయని తెలిపారు. కర్నూలు జిల్లాలో గురువారం రాత్రి మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. 47 మండలాల్లో సరాసరిన 10.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రకాశం, నెల్లూరు, గుంటూరులో భారీ వర్షం కురిసింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై మురుగునీరు ప్రవహించింది.










