Jul 13,2022 22:44

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌: ఈ నెల 15,16 తేదీల్లో మారిస్‌ స్టెల్లా కళాశాల వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డా.సిస్టర్‌ జసింతా క్వాడ్రస్‌ తెలిపారు. 60 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో కాలేజ్‌ విత్‌ పోటన్షియల్‌ ఫర్‌ ఎక్స్‌ లెన్స్‌ స్థాయిని అందుకుని కళాశాల ప్రగతిని జాతీయ స్థాయిలో ఇండియా టుడే ర్యాంకుల జాబితా వరకు నడిపించటం సంతోషదాయకం అన్నారు. బుధవారం కళాశాలలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ జసింతా మాట్లాడుతూ ఈ వజ్రోత్సవాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, పలువురు ప్రముఖులు హాజరవుతారని పేర్కొన్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా 1962లో కళాశాల స్థాపించటం జరిగిందని, ఎన్నో వినూత్నమైన వైవిధ్యమైన కోర్సులను అందిస్తూ ఎందరో మహిళలకు సాధికారత వైపు బాటలు వేసిందని పేర్కొన్నారు. అనంతరం వజ్రోత్సవాల వేడుకల పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సమావేశంలో కరస్పాండెంట్‌ సిస్టర్‌ స్లివా, కళాశాల డిగ్రీ వైస్‌ ప్రిన్సిపల్స్‌ డా.సిస్టర్‌ లావణ్య, కె.అనూహ్య, మీడియా ఇన్ఛార్జ్‌ స్వప్న, కళాశాల కోకరిక్యులర్‌ కోర్సుల ఇన్చార్జ్‌ డా.జి.వనజాకుమారి తదితరులు పాల్గొన్నారు.