Jul 05,2022 23:54

  • సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌

ప్రజాశక్తి-జగ్గయ్యపేట టౌన్‌: ఈ నెల 11 నుండి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు తలపెట్టిన నిరవదిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ సిహెచ్‌ శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన సమ్మె సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్ల కార్మికుల్లో తీవ్ర అసంతప్తి నెలకొని ఉందని, గత మూడేళ్లుగా ఏ సమస్య పరిష్కారానికి నోచుకోలేదని ప్రభుత్వ మొండి వైఖరి వల్ల కార్మికులు గత్యంతరం లేక సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మున్సిపల్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులతో సంప్రదింపులు జరిపి మున్సిపల్‌ కార్మికులకు బకాయిల చెల్లింపుతో పాటు 15 వేల రూపాయలు జీతం హెల్త్‌ ఆరువేల రూపాయలు కలిపి ఒకేసారిగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ కార్మికులకు 11వ వేతన సవరణ కమిటీ సిఫారసుల మేరకు 20000 రూపాయలు జీతం, కరువు భత్యం చెల్లింపు, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల పర్మనెంట్‌, పట్టణ విస్తరణ మేరకు సిబ్బంది పెంపు, ఆప్కాస్‌ ద్వారా రిటైర్మెంట్‌ చేసిన వారి బిడ్డలకు ఉద్యోగాలు అర్హులైన వారికి ప్రమోషన్లు తదితర న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పారాయ ఎల్లమ్మ కంది రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.