Jun 06,2023 21:51

సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ రమణారెడ్డి

          ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌   నగరపాలక సంస్థ పరిధిలో యూజర్‌ ఛార్జీల వసూళ్లలో పురోగతి కనబరచాలని కమిషనర్‌ రమణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక నగరపాలక సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు సచివాలయాలపై పర్యవేక్షణ, ప్రజలకు అందించే సర్వీసులు సకాలంలో సక్రమంగా అందించాలన్నారు. ముఖ్యంగా పారిశుధ్యం మెరుగుకు కృషి చేయాలన్నారు. నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న 74 సచివాలయాల పరిధిలో నోడల్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లను నియమించినప్పటికీ యూజర్‌ ఛార్జీల వసూళ్లలో పురోగతి కొంత వరకూ మాత్రమే కనపడుతోందన్నారు. ఇప్పటికైనా ప్రతిఒక్కరూ వారికి కేటాయించిన యూజర్‌ ఛార్జీల పెంపునకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్‌ సావిత్రి, నగర పాలక సంస్థ కార్యదర్శి సంఘం శ్రీనివాసులు, నగర పాలక సంస్థ ఎంహెచ్‌ఒ గంగాధర్‌ రెడ్డి, డిఇఇలు, టిఎఇలు, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు, నోడల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.