
ప్రజాశక్తి-కరాస: 'అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వృద్ధ ఓటర్లను గౌరవించి, కృతజ్ఞతలు తెలియజేయాలన్న ఎన్నికల సంఘం సూచనల మేరకు పశ్చిమ నియోజకవర్గం, 24వ పోలింగ్ బూత్లో అత్యధిక సార్లు ఓటుహక్కు వినియోగించుకున్న సీనియర్ సిటిజన్లు, 57వ వార్డు ఆశివానిపాలెం 190 పోలింగ్ బూత్ ఓటరు 85ఏళ్ల సూరెడ్డి దేముడమ్మను, అదేవిధంగా కంచరపాలెం రామ్మూర్తి పంతులుపేట 205 పోలింగ్ కేంద్రం ఓటరు 82ఏళ్ల మెట్టా సత్యనారాయణమూర్తి, 81ఏళ్ల బొడ్డేటి కొండమ్మ)లను ఆర్డిఒ హుస్సేన్ సాహెబ్, గోపాలపట్నం తహశీల్దార్ కొర్ర జయ, డిప్యూటీ తహశీల్దార్ సయ్యద్ జిలానీ దుశ్శాలువాతో సత్కరించారు. లక్షలాది మంది యువ ఓటర్లకు స్ఫూర్తిగా నిలిచారని అభినందించారు. కార్యక్రమంలో బిఎల్ఓ కిషోర్ కుమార్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
గొలుగొండ:మండలంలోని కొత్తమల్లంపేట గ్రామంలో 80 ఏళ్లు పైబడిన వృద్దులకు విలేజ్ రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో సర్పంచ్ పోలిరెడ్డి రాజబాబు, ఎంపిటిసి బి.సీత చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు.ఓటు హక్కు వినియోగించుకుంటున్న వృధ్దులను సన్మానించడం మంచి విషయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎర్రినాయుడు పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సీనియర్ సిటిజన్స్ను బిఎల్వోలు ఘనంగా సన్మానించారు. ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఎన్నో ఏళ్లుగా ఓటు వేస్తున్న వృద్ధులకు సాలువాలు కప్పి సత్కరించారు.
నర్సీపట్నంటౌన్: ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో తహసిల్దార్ అన్నాజీరావు వృద్ధులను సన్మానించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, అనేకసార్లు ఎన్నికలలో ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వృద్ధులను సన్మానించడం ఆనందదాయకమన్నారు. ప్రభుత్వం పకడ్బందీగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తుందన్నారు. ఆర్డీవో కార్యాలయ పరిపాలనాధికారి సూర్యనారాయణ తో కలిసి ఆయన వృద్ధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డిటి సుధావాణి, ఆర్ఐ వెంకటలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మణరావు, వి ఆర్ఓలు రాజుల నాయుడు, కమల పాల్గొన్నారు.