వంద గ్రామాలలో 13 నోటిఫికేషన్లు విడుదల
72 గ్రామాలకు సంబంధించి ఫైనల్ ఆర్ఓఆర్ పూర్తి : కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్
జిల్లాలో రీసర్వే పనులు వేగంగా జరుగుతున్నాయని ఇప్పటివరకు 100 గ్రామాలకు సంబంధించి 13 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని, 72 గ్రామాలకు సంబంధించి ఫైనల్ ఆర్ఓఆర్ పూర్తి అయిందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ తెలిపారు. గురువారం సీసీఎల్ఏ కార్యదర్శి సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ జగనన్న భూహక్కు భూరక్ష కార్యక్రమం అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రీసర్వే పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికి వంద గ్రామాలలో 13 నోటిఫికేషన్ విడుదల చేయడంతోపాటు 72 గ్రామాలలో ఫైనల్ ఆర్ఓఆర్ పూర్తిచేయడం జరిగిందని తెలిపారు. సర్టిఫికేషన్ కార్యక్రమం కూడా వేగంగా నిర్వహించడం జరుగుతున్నదన్నారు. జిల్లాలో 12 గ్రామాలకు సంబంధించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సీసీఎల్ఏ కార్యదర్శి మాట్లాడుతూ సర్టిఫికేషన్ కార్యక్రమం ఈనెల 15వ తేదీ లోపల పూర్తి చేయాలని, 22 అక్టోబర్ నాటికి మ్యుటేషన్లో ఏవైన పనులుంటే పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అనంతరం పిడిఎఫ్లో తయారుచేసిన తర్వాత ప్రింటింగ్ పంపడం జరుగు తుందని దీనికి సంబంధించి అందరూ సంసిద్ధంగా ఉండాలన్నారు. మ్యుటేషన్ కార్యక్రమంలో వీలైనంతవరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిచేయాలని ఒకవేళ పెండింగ్లో ఉంటే ఆ భూహక్కు పత్రాలను తర్వాత ఇవ్వడం జరుగుతుందని సీసీఎల్ఏ కార్యదర్శి తెలిపారు. దీనికి సంబంధించి కలెక్టర్లు నేరుగా మానిటరింగ్ చేయాలన్నారు. కోర్టు ప్రొసిజర్ ప్రకారం ఏదైనా అభ్యంతరాలుంటే ఆ అభ్యంతరాలను వెంటనే గుర్తించి ఆన్లైన్లో పంపాలని అప్పుడే హక్కు పత్రాల ప్రింటింగ్ ఆపడం జరుగుతుందన్నారు. చిత్తూరు జిల్లా నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.










