
ప్రజాశక్తి - శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరంలో విలీనమైన పంచాయతీల్లో సుమారు రూ.పది కోట్లతో తారు రోడ్లకు మరమ్మతులు చేపట్టనున్నట్లు కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. మున్సిపల్ అధికారులతో కలిసి పాత్రునివలస ప్రధాన రహదారిని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విలీన పంచాయతీల్లో ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలన్న లక్ష్యంతో తారు రోడ్లకు మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. ఇటీవల 80 అడుగుల రహదారిలో కొత్తగా వేసిన తారు కోటింగ్ పనుల నాణ్యతనూ పరిశీలించినట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా కుశాలపురం, తోటపాలెం రహదారి మరమ్మతు పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఇంజినీరింగ్ పనులను అత్యంత నాణ్యతా ప్రమాణాలతో వీలైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సిహెచ్.ఓబులేసు, మున్సిపల్ డిఇ కె.రమణమూర్తి, మున్సిపల్ ఇంజినీర్ పి.వి గంగాధర్, వార్డు ఎమైనిటీస్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.