ఉరవకొండ : అఖిల భారత వీరశైవ లింగాయత్ల మహాసభ అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తానని నూతనంగా ఎంపికైన అఖిలభారత వీరశైవ లింగాయత్ మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దండిన శివానంద పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన దండిన శివానంద అఖిలభారత వీరశైవ లింగాయత్ మహాసభ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఇటీవల ఎన్నిక అయ్యారు. ఈయన్ను కర్నాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలో గురువారం నాడు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దండిని శివానంద మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పెద్దలు, సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అఖిలభారత వీరశైవ లింగాయతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. వీరశైవ లింగాయత్ యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు నెలకొల్పి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక చర్యలు చేపడతానన్నారు. అనంతరం అఖిలభారత వీరశైవ బళ్లారి జిల్లా ప్రధాన కార్యదర్శి గంగావతి వీరేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఎంపికైన అఖిలభారత వీరశైవ లింగాయత్ మహాసభ ఏపీ అధ్యక్షులు దండిని శివానందతో పాటు ఆయన సతీమణి వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ దండిన సులోచన దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బనిజ సంఘం బళ్లారి జిల్లా అధ్యక్షులు టెక్కలకోటి బసవరాజు, కర్ణాటక రక్షణ వేదిక జిల్లా అధ్యక్షులు సేనాల్ శేఖర్, కోరి విరుపాక్షప్ప పాల్గొన్నారు.










