విద్యుత్ సవరణ చట్టం రద్దు చేయాలి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సోమవారం విద్యుత్ ఉద్యోగులు విధులను బహిష్కరించి ప్రభుత్వ తీరును నిరశిస్తూ స్థానిక గాంధీ రోడ్డులోని విద్యుత్శాఖ కార్యాలయం ఎదుటు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రసిటి ఎంప్లాయిస్ నాయకులు విఘ్నేశ్వరావు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సరవరణ చట్టం అమల్లోకి వస్తే పూర్తిస్థాయిలో విద్యుత్ రంగం ప్రయివేటీకరణకు గురై ఉద్యోగులు, వినియోగదార్లు ఇబ్బందులు పడే అవకాశముందన్నారు. విద్యుత్ సవరణ బిల్లులు 2022 ద్వారా దేశసంపదతో పాటు రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. విద్యుత్ సరవణ చట్టాన్ని ప్రతిఘటించి విద్యుత్ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులు, సిబ్బందితో పాటు వినియోగదారులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










