ప్రజాశక్తి - పాలకోడేరు
విద్యార్థులు ఒక లక్ష్యం నిర్దేశించుకుని భవిష్యత్తులో స్థిరపడే విధంగా చదువుకోవాలని, అప్పుడే జీవితంలో స్థిరపడతారని భీమవరం విష్ణు విట్ కళాశాల అధ్యాపకులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. పెన్నాడ జిల్లా పరిషత్ హైస్కూల్లో విష్ణు విట్ కళాశాల ఎన్ఎస్ఎస్ క్యాంపులో భాగంగా బుధవారం విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, టెక్నాలజీ వినియోగంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విట్ కళాశాల అధ్యాపకులు, గ్రామ పంచాయతీ సర్పంచి అనూష, అధ్యాపకులు అమూల్య, శ్యామల, కృష్ణ మాధురి, నాగరాణి, సురేష్కుమార్ విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రీదేవి, కళాశాల ప్రిన్సిపల్ దసరా సూర్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ కె.శ్రీనివాస్, డీన్ నాగేంద్రకుమార్, హెచ్ఒడిలు శ్రీలక్ష్మి, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.










