
ప్రజాశక్తి -పల్నాడు జిల్లా : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఓపెన్ హౌస్ (పోలీసులు విధి నిర్వహణలో శాంతి భద్రతల పరిరక్షణకు ఉపయోగించే ఆయుధాల ప్రదర్శన) నిర్వహించారు. కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ (ఎఆర్) రామచంద్రరాజు ప్రారంభించారు. ఎస్పీ వై రవిశంకర్రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, దర్యాఫ్తులో ఉపయోగించే ఆయుధాలు, సాంకేతిక పరికరాల గురించి విద్యార్థుకు అవగాహన కల్పించేందుకు ఆయుధాల ప్రదర్శన చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం వల్ల సమాజ శ్రేయస్సు కొరకు పోలీస్ వారు నిర్వర్తించే విధులు గురించి విద్యార్థులకు అవగాహన ఏర్పడి, ప్రేరణ పొందుతారని, తద్వారా యువత పోలీస్ శాఖ, ఇతర భారత బలగాలలో సేవలందించడానికి ముందుకు వస్తారని చెప్పారు. విద్యార్థులకు ఆయుధాలు, సాంకేతిక పరికరాల వివరాలు, వాటి పనితీరును అదనపు ఎస్పీ రామచంద్ర రాజు నరసరావుపేట డీఎస్పీ కెవి మహేష్, ఎఆర్ డిఎస్పీ చిన్నికృష్ణ, ఆర్ఐలు రవికిరణ్, రమణారెడ్డి, వెంకటరమణ వివరించారు. తదనంతరం నేర దర్యాఫ్తులో ప్రముఖ పాత్ర పోషించే జగిలాల ప్రదర్శనను చూపించారు.