Aug 11,2022 21:56

విఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌

ఏళ్ల తరబడి వారసత్వంగా నామినిలుగా పనిచేస్తున్న విఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, నెలకు రూ.21వేలు కనీసవేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కలెక్టరేట్‌ ఎదుట విఆర్‌ఏలు ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సంరద్భంగా విఆర్‌ఏల సంఘం జిల్లా సహాయకార్యదర్శి కోదండన్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.చైతన్య మాట్లాడుతూ రూ.10,500లు తక్కువ జీతంతో విఆర్‌ఏలు కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. 2018 సంవత్సరం నుంచి నెలకు రూ.300లు డిఏ చెల్లిస్తూ ప్రభుత్వం ఇస్తున్న డీఏను తిరిగి చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయమని విమర్శించారు. ప్రభుత్వం వెనక్కి తీసుకున్న నెలకు రూ.300లను తిరిగి చెల్లించాలని, రికవరీ చేయాలని ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పాదయాత్ర సమయంలో జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. పెరుమాళ్‌, లోకనాథం, నజీర్‌, వెంకటేష్‌, విఆర్‌ఏలు పాల్గొన్నారు.