
ప్రజాశక్తి- అనకాపల్లి
వెలుగు సిబ్బంది అక్రమాలపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ గురువారం స్థానిక డిఆర్డిఏ కార్యాలయం వద్ద సిపిఎం మండల కన్వీనర్ గంట శ్రీరామ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గంట శ్రీరామ్ మాట్లాడుతూ సత్యనారాయణపురం గ్రామం శ్రీ వెంకట సాయి ఎస్హెచ్జి గూప్ పేరుతో మహిళలతో బోగస్ గ్రూప్ ఏర్పాటు చేసి బ్యాంకు ఆప్ ఇండియాలో రూ.15,00,000 లోన్ చేసి వెలుగు సిబ్బంది కాజేసి డ్వాక్రా మహిళలను మోసం చేశారని ఆరోపించారు. ఒక్క రూపాయి కూడా డ్వాక్రా మహిళలకు రుణాలుగా ఇవ్వలేదన్నారు. దీనిపై వెంటనే అదికారులు దర్యాప్తు చేసి మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పుర్రె లక్ష్మి పేరుతో ఇదేవిధంగా ముద్ర రుణాలు రూ.50వేలు కాజేశారన్నారు. అనేకమందికి ముద్రా రుణాలు రూ.15 లక్షల చొప్పున 6 గ్రూపుల వరకు సుమారు కోటి 20 లక్షలు రూపాయలు వరకు వెలుగు సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. దీనిలో ఎవరెవరి పాత్ర ఉందో తేల్చాలని జిల్లా అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపమాక నాగలక్ష్మి, నందికి రాణి, నందికి నాగమణి, ఆకుల దుర్గ, బోడి ఝాన్సీ, పుర్రె లక్ష్మి, పెదపూడి సుత్తి తదితరులు పాల్గొన్నారు.