Oct 31,2023 23:49

విచారణలో మాట్లాడుతున్న సిపిఎం మండల కన్వీనర్‌ గంటా శ్రీరామ్‌

ప్రజాశక్తి -అనకాపల్లి
మండలంలోని సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలో వెలుగు సిబ్బంది చేసిన అవినీతిపై డిఆర్‌డిఎ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ లక్ష్మీపతి, అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ డైజీ తదితరులు సత్యనారాయణపురం దిబ్బల మీద నల్ల మారమ్మ గుడి వద్ద మంగళవారం విచారణ చేపట్టారు. ఈ అవినీతిపై సోమవారం స్పందన కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకులు డిడి వరలక్ష్మి, జి సుభాషిణి, ఉపమాక లోవలక్ష్మి, బోడి నూకరత్నం తదితరులు కలెక్టర్‌ జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టికి చేసిన ఫిర్యాదు మేరకు ఆయన స్పందించి విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా బాధిత మహిళ పెదపూడి శృతి మాట్లాడుతూ తన పేరును హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మూడు గూపులలో చేర్చి డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి నగదు కాజేసిందని తెలిపారు. మరో బాధిత మహిళ బోడి ఝాన్సీ తాను బ్యాంకుకు వెళ్లకుండానే తన పేరుపై బ్యాంకు రుణం చేసి నిధులు డ్రా చేశారని చెప్పారు. వెలుగు సిబ్బంది గ్రామ సమైక్య సంఘం మీటింగ్‌లు పెట్టలేదని కొంతమంది బాధితులు తెలిపారు. వెంకట సాయి, సిరిబగవది, పద్మావతి, శ్రీ బాలాజీ, ఉదయభాను పేరుతో బోగస్‌ డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి బ్యాంకు ఆప్‌ ఇండియాలో ఒక్కో గ్రూపు పేరుపై 15 లక్షల రూపాయలు రుణం తీసుకున్నారని తెలిపారు. అలాగే కొత్తూరు పంచాయతీలో 2 బోగస్‌ డ్వాక్రా గూపులు ఏర్పాటు చేశారన్నారు. మొత్తం 7 గ్రూపుల పేరుతో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా కోటి 5 లక్షలు రూపాయలను వెలుగు, బ్యాంకు అధికారులు కాజేశారని తెలిపారు.
ఐద్వా జిల్లా కార్యదర్శి డిడి వరలక్ష్మి మాట్లాడుతూ ఈ డ్వాక్రా అవినీతిపై సమగ్ర విస్తరణ జరిపి బాధితులకు తగు న్యాయం చేయాలని కోరారు. సిపిఎం మండల కన్వీనర్‌ గంటా శ్రీరామ్‌ మాట్లాడుతూ ఒక గ్రూపులో సభ్యురాలిగా ఉండగా రెండో గ్రూపు ఏర్పాటు చేయడానికి వీలులేదని, ఒక గ్రూప్‌ నుంచి ఇద్దరు ముగ్గురు తీసుకుని వచ్చి కొత్తగా బోగస్‌ డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి నిధులు కాజేశారని తెలిపారు. బ్యాంక్‌ అధికారులు రిజర్వ్‌ బ్యాంక్‌ గైడెలైన్స్‌ పాటించలేదన్నారు. ఇందులో వెలుగు అధికారుల పర్యవేక్షణ లోపం ఉందన్నారు. అనేక విషయాలను బ్యాంక్‌ అధికారులు, వెలుగు సిబ్బంది కుమ్మక్కై దాస్తున్నారని తెలిపారు.
దీనిపై వెలుగు సిబ్బంది సరిగా స్పందించకపోవడంతో డిఆర్డిఏ పిడి లక్ష్మీపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులందరికీ ఎంక్వయిరీ విషయం ఎందుకు చెప్పలేదని మండిపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధితులందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సభ్యులందరికీ తెలియజెప్పి తిరిగి బుధవారం సత్యనారాయణపురం దేవాలయం వద్ద గ్రామసభను ఏర్పాటు చేసి బహిరంగంగా విచారణ చేపడతామని, బాధితులందరూ లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు.