
ప్రజాశక్తి-తాడేపల్లి, పల్నాడు జిల్లా : ఈ నెల 15న విజయవాడలో జరిగే ప్రజా రక్షణభేరి బహిరంగ సభకు గుంటూరు, పల్నాడు జిల్లాల నుండి వేలాదిమంది తరలిరానున్నారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శులు పాశం రామారావు, గుంటూరు విజరుకుమార్ అన్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని సిపిఎం కార్యాలయంలో రామారావు విలేకర్లతో మాట్లాడగా, విజరుకుమార్ ఒక ప్రకటన జారీ చేశారు. రామారావు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో ఇప్పటికే 150 మున్సిపల్ వార్డులు, 167 గ్రామాల్లో విస్తృత ప్రచారం, 300 గ్రూపు సమావేశాలు జరిగాయని వివరించారు. విజయవాడలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే సభలో సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి, పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.పుణ్యవతి, ఎంఎ గఫూర్తో పాటు రాష్ట్ర నాయకత్వం పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన బిజెపి విధానాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తాము జరిపిన క్యాంపెయిన్లో ప్రజలు చెప్పినట్లు తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు తదితర హామీలన్నీ నెరవేర్చకుండా తీరని అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిన బిజెపి పట్ల వైసిపి, టిడిపి మెతక ధోరణి అవలంభించడం పట్ల ప్రజలు క్షమించరని చెప్పారు. జనసేన పార్టీ బిజెపి గూటికి చేరిందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్రంలో వైసిపి అమలు చేస్తోందని, ప్రజలపై విద్యుత్ భారాల మోపారని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతుల నడ్డి విరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక సూత్రాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని మార్చడానికి రిజర్వేషన్ల మీద సమీక్ష నిర్వహించడానికి బిజెపి పూనుకుందని విమర్శించారు. మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయడానికి పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా టిడిపి బిజెపి పట్ల తన వైఖరిపై పునరాలోచించుకోవాలన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు విషయంలో మోడీ, అమిత్షా హస్తం ఉందని తెలిసినా ఆ పార్టీ బిజెపి పట్ల మెతక వైఖరి అవలంభించడం తమ ఉనికికే ప్రశ్నార్థకమని తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పర విమర్శలతో ప్రజా సమస్యలను గాలికొదిలేశాయన్నారు. ప్రజా సమస్యలే అజెండాగా సిపిఎం బస్సు యాత్రలు నిర్వహించిందని చెప్పారు. సమావేశంలో డి.శ్రీనివాసకుమారి, కె.కరుణాకరరావు, జి.సుబ్బారెడ్డి, జగన్, కె.మేరి, డివి భాస్కరరెడ్డి పాల్గొన్నారు.
విజరుకుమార్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజల వద్దకు వచ్చే ఆయా రాజకీయ పార్టీల నేతలకు సిపిఎం ప్రజా రక్షణ భేరి రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర సందర్భంగా ప్రచురించిన ప్రణాళిక పత్రాలను చూపి ప్రజలు ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. బిజెపి తన తొమ్మిదిన్నరేళ్ళ పాలనలో మాయ మాటలతో రాష్ట్రానికి ద్రోహం చేసిందని, ఆ పార్టీతోపాటు దానికి కొమ్ముగాస్తున్న పార్టీలను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని కోరారు. దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలిపారన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రజలపై భారాలు పెరిగాయని, ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఎన్నడూ లేని విధంగా యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అటువంటి చర్యలేమి తీసుకోకుండా నిరుద్యోగ యువతను మోసం చేశారన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో దళితులపై, ముస్లిములపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలి ఉద్యమాల గొంతు నొక్కడం, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపడం వంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు, జిల్లా కమిటీ సభ్యులు డి.శివకుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపికి రైతుల బాధలు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలపై విద్యుత్,గ్యాస్, బస్, చార్జీలు, ఆస్తి, చెత్త పన్నులతో ప్రజల నడ్డి విరిచారన్నారు. సాధికార బస్సు యాత్రలో ఉన్న వైసిపి ఎమ్మెల్యేలు మంత్రులు కనీసం బస్సులో నుండి తొంగి చూసైనా రైతులు సాగు చేస్తున్న పంటల పరిస్థితి గురించి ఆలోచన చేయాలని, నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. ప్రజల కోసం సిపిఎం నికరంగా పోరాడుతోందని చెప్పారు. అందులో భాగంగా విజయవాడ బి.ఆర్.టి.ఎస్ ఫుడ్ జంక్షన్ వద్ద ఉదయం 10 గంటలకు ప్రదర్శన, 11 గంటలకు అజిత్ సింగ్ నగర్ ఎంబి ప్రాంగణంలో సిపిఎం బస్సు యాత్ర ముగింపు బహిరంగ సభ ఉంటుందని వివరించారు. సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి షేక్ సిలార్ మసూద్ తదితరులు పాల్గొన్నారు.