Aug 01,2022 21:42

వేగంగా 'స్పందన' వినతుల పరిష్కారం: కమిషనర్‌
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
'స్పందన' కార్యక్రమంలో అందే వినతులపై వేగంగా విచారణ చేసి పరిష్కరించాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ విభాగాల అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కమిషనర్‌ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రధానంగా ఈశ్వరగుడి వీధి వద్దనున్న నీవానదిపై కల్వర్టరు నిర్మించాలని స్థానికులు విన్నవించారు. గత ఏడాది వర్షాలకు కల్వర్ట్‌ దెబ్బతినడంతో ప్రస్తుతం రాకపోకలకు ఇబ్బందిగా మారిందన్నారు. స్పందన కార్యక్రమంలో పింఛన్లుకు సంబంధించి 4, టౌన్‌ ప్లానింగ్‌ 3, ఇంజనీరింగ్‌ విభాగం 3 మొత్తం పది వినతులు అందాయి. స్పందన కార్యక్రమంపై కమిషనర్‌ శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈవారం వచ్చే వినతులను మరుసటి వారానికి పరిష్కరించి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, ఎంఈ ధనలక్ష్మీ, ఎంహెచ్వో అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.