అనంతపురం కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ ఆసరా మూడో విడత కింద లబ్ధిదారులకు రూ.233.66 కోట్లు సాయం అందిందని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ భవనంలో జిల్లా స్థాయి వైఎస్సార్ ఆసరా నగదు బదిలీ కార్యక్రహాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పొదుపు సంఘాల మహిళల ఆర్థికాభివద్ధి కోసం ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రుణ మాఫీ చేస్తోందన్నారు. ఎప్పటికప్పుడు వాయిదాలు చెల్లించే మహిళలు మాఫీ చేసిన సొమ్మును కుటుంబ అభివధ్ధికోసం వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 31,229 సంఘాలకు రూ.236.66 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. ఇందులో గ్రామీణ సంఘాలు 24,098 ఉండగా వారికి రూ.183.56 కోట్లు, పట్టణ సంఘాలు: 7131 ఉండగా వారికి రూ.53.10 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. అనంతరం లబ్ధిదారులకు మెగా చెక్కును ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జెడ్పీ ఛైర్పర్సన్ బోయ గిరిజమ్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహితి, కోగటం విజరు భాస్కర్ రెడ్డి, నాటక అకాడమీ ఛైర్ పర్సన్ హరిత, పర్యాటక కార్పొరేషన్ డైరెక్టర్ భూమిరెడ్డి జాహ్నవి, జిల్లా గ్రంథాలయ చైర్ పర్సన్ ఉమాదేవి, వక్ఫ్ బోర్డు ఛైర్పర్సన్ రిజ్వాన్, డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి, మెప్మా పీడీ విజయలక్ష్మి, ఆసరా లబ్ధిదారులు పాల్గొన్నారు.










