
ప్రజాశక్తి-అచ్యుతాపురం
అచ్యుతాపురంలో శుక్రవారం జరిగిన వారపు సంతకు దసరా శోభ సంతరించుకుంది. దసరా పండగ సందర్భంగా ఈ సంతలో గొర్రెలు, మేకలు, నాటు కోళ్లకు మంచి గిరాకీ ఏర్పడింది. వేలాది సంఖ్యలో గొర్రెలు, మేకలు నాటు కోళ్లు విక్రయాలు జరిగాయి. సంత సందర్భంగా విశాఖపట్టణం, గాజువాక, స్టీల్ ప్లాంట్ తదితర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు, కార్మిక, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రత్యేక వాహనాల్లో వచ్చి గొర్రెలు మేకలు, కోళ్ళు కొనుగోలు చేశారు. శుక్రవారం నాటి వ్యాపారం సుమారు అరకోటి రూపాయలకు పైనే ఉంటుందని అంటున్నారు. గొర్రెలు మేకలను, నాటు కోళ్లను అచ్చుతాపురం, రాంబిల్లి తదితర మండలాలకు చెందిన రైతులు సంతలో విక్రయించటానికి తీసుకొచ్చారు. దసరా నేపథ్యంలో ధరలు ఎక్కువగా పలికాయి. ఒక్కొక్క గొర్రె సైజు, బరువు, కొమ్ములు వాడిని బట్టి రూ.10వేలు నుంచి రూ.25 వేలు వరకు ధరలు పలుకాయి. నాటు కోడి వెయ్యి రూపాయల మొదలు పెట్టుకుని 3000 రూపాయల వరకు విక్రయాలు జరిగాయి.