
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: జిల్లాకి చెందిన ఫెన్సింగ్ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో కూడా సత్తా చాటాలని ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బలభద్రుని సురేష్ కుమార్ (రాజా) సూచించారు. జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన నగరంలోని టౌన్ హాల్లో అండర్-23, సీనియర్ విభాగాల్లో పురుషులకు, మహిళలకు వేర్వేరుగా ఆదివారం నిర్వహించిన ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న ఫెన్సింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రీఢాకారులకు అసోసియేషన్ నుంచి ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ నెల 14,15 తేదీల్లో కాకినాడలో జరగనున్న 10వ రాష్ట్రస్థాయి ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ మెన్ అండ్ ఉమెన్, 7వ రాష్ట్రస్థాయి ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ (అండర్ -23) పోటీల్లో పాల్గొని సత్తాచాటాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి జోగిపాటి వంశీ, కోశాధికారి డి.భవానీ, రాహుల్, దిబ్బ దిలీప్కుమార్, వైశ్యరాజు మోహన్, గిడుతూరి వెంకటేశ్వరరావు, సుధీర్ వర్మ, గురుగుబెల్లి ప్రసాద్ పాల్గొన్నారు.