Oct 06,2023 21:08

ఫొటో : ఉపాధ్యాయులను సన్మానించిన సిబ్బంది

ఉపాధ్యాయులకు సన్మానం
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని కదిరినాయుడుపల్లి కాంప్లెక్స్‌ పరిధిలో పనిచేస్తూ ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన ఉపాధ్యాయులను శుక్రవారం సన్మానించారు. కంభం విజయారెడ్డి, మాగంటి సుబ్బయ్య, స్కూల్‌ అసిస్టెంట్‌గా ప్రమోషన్‌ పొందిన మహిమలూరు సూర్య ప్రకాష్‌, సి.ఆర్‌.పి.గా పనిచేస్తూ సిఎంఆర్‌టిగా మండల విద్యాశాఖకు బదిలీపై వెళ్లిన ఇరుపోతు భాగ్యమ్మలను పడమటి నాయుడుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో కదిరినాయుడుపల్లి కాంప్లెక్స్‌ పరిధిలోని ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎంఇఒ-2 ధనలక్ష్మి మాట్లాడుతూ నలుగురు ఉపాధ్యాయులు విధి నిర్వహణలో ఎంతో నిబద్ధతతో, అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలను పొందారని తెలిపారు. విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, వారి సేవలను ఘనంగా కొనియాడారు. అనంతరం కాంప్లెక్స్‌ పరిధిలోని ఉపాధ్యాయులు వారిని శాలువాపూలమాల, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు మున్నెల్లి.రవి, విశ్రాంత ఎంఇఒ జొన్నా సత్యనారాయణ, ఎం.ఆర్‌.జి రాజేంద్ర కుమార్‌, కాంప్లెక్స్‌ సెక్రటరీ విజయభాస్కర్‌ రెడ్డి, సిఎంఆర్‌టి కస్తూరయ్య, ఎంఇఒ కార్యాలయ సిబ్బంది శ్రీనివాసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.