Aug 05,2023 21:13

ప్రజాశక్తి - తణుకురూరల్‌
రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు బదిలీలు, ఉద్యోగోన్నతులు నిర్వహించి రెండు నెలలైనా నేటికీ సుమారు 60 వేల మందికి జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎపిటిఎఫ్‌ రాష్ట్ర పూర్వ కార్యదర్శి ఐ.రాజగోపాల్‌ విమర్శించారు. శనివారం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్‌ పిఎన్‌డి.ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌ మాట్లాడుతూ ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించాలని, సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. జిఒ 117ను రద్దు చేసి 3, 4, 5 తరగతుల విలీనాన్ని ఆపాలని, 11వ పిఆర్‌సి బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎ.వీరభద్రరావు, పెద్దిరాజు, అంజబాబు, రామప్రసాద్‌ పాల్గొన్నారు.
పెనుమంట్ర:ఇటీవల బదిలీలైన ఉపాధాయ్యులకు రెండు నెలలుగా జీతాలందక వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారికి జీతాలు చెల్లించాలని ఎపిటిఎఫ్‌ మండల శాఖ డిమాండ్‌ చేసింది. ఎపిటిఎఫ్‌ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ దండు అశోక్‌ వర్మకు నేతలు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు పిఎన్‌వి.ప్రసాద్‌రావు, రాష్ట్ర కౌన్సిలర్‌ సిహెచ్‌వి.సత్యనారాయణ, మండల అధ్యక్షులు సిహెచ్‌వి.నరేంద్ర, ప్రధానకార్యదర్శి కండిబోయిన రాంబాబు పాల్గొన్నారు.
పెనుగొండ : బదిలీలు, ఉద్యోగోన్నతి పొందిన ఉపాధాయులకు రెండు నెలలుగా జీతాలివ్వక ఇబ్బంది పడుతున్నారని, వెంటనే వారికి జీతాలివ్వాలని ఎపిటిఎఫ్‌ మండల శాఖ ఆధ్వర్యాన తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి పి.జనార్ధనస్వామి, జిల్లా కౌన్సిలర్లు బి.రాజారావు, ఎ.సుబ్రహ్మణ్యం, మండల అధ్యక్షులు రాఘవులు, ప్రధాన కార్యదర్శి పోతురాజు పాల్గొన్నారు.