Oct 29,2023 00:35

మాజీ మంత్రి అయ్యన్న

ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్‌:సిఎం జగన్‌ రెడ్డి యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. వ్యవసాయ క్షేత్రంలో శనివారం తెలుగుదేశం పార్టీ విస్తతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ, ఈ సంవత్సరం రైతులకు గడ్డుకాలం ఏర్పడిందని, వర్షాలు లేక పంటలు దెబ్బతిన్నాయని ఈ మేరకు అనకాపల్లిని కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ రెడ్డి చేస్తున్న అరాచక పనులను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని బూత్‌ కన్వీనర్లకు సూచించారు. నియోజకవర్గంలో 12 వేల దొంగ ఓటర్లను చేర్పించారని, 17 వేల ఓటర్లను తొలగించినట్లు గుర్తించామని, వీటిపై రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ప్రతి ఓటరు కూడా తమ ఓటు ఉందో లేదో ఆన్లైన్లో సరి చూసుకోవాలన్నారు. కుటుంబ సాధికారత భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ముస్లిం సోదరులకు, జర్నలిస్టులకు ఇల్లు ఇస్తానని చెప్పి మోసం చేసిన జగన్‌ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. యువతకు ఉపాధి కల్పించే లులూ వంటి కంపెనీలు జగన్‌ రెడ్డి వల్లే పోయాయని విమర్శించారు. రాష్ట్రంలో ఇటువంటి కంపెనీలు ఉంటే యువతకు ఉపాధి కలిగేదని పేర్కొన్నారు. ఈ నాలుగు సంవత్సరాలలో రోడ్ల మరమ్మతు చేపట్టిన దాఖలాలు లేవన్నారు.