Nov 06,2023 00:44

నిరుపయోగంగా ఉన్న పసుమర్రు వద్ద ఎత్తిపోతల పథకం

ప్రజాశక్తి - చిలకలూరిపేట : ఎత్తిపోతల పథకాల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నా వాటి నుండి చుక్కనీరైనా రావడం లేదు. ఒకప్పుడు పొలాలను సస్యశ్యామలం చేసిన పథకాలు నాలుగేళ్ల తరబడి నిర్వహణ లోపం కారణంగా నేడు నిరుపయోగంగా మారాయి. ఒకవైపు ఎండిపోతున్న పైర్లు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తుంటే మరోవైపు నీళ్లివ్వకుండా పథకాలు వెక్కిరిస్తున్నాయి.
చిలకలూరిపేట మండలంలోని యడవల్లి, బొప్పుడి, పురుషోత్తమపట్నం, కావూరు, చిలకలూరిపేటతోపాటు గణపవరంలో 30 వరకూ ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. నాదెండ్ల, యడ్లపాడు మండలాల్లో మరో 30 వరకూ ఉన్నాయి. వీటికింద గతంలో 40 వేల ఎకరాల వరకూ ఆరుతడి పంటలకు సాగునీరు అందేది. వీటి నుండి నీరు అందకుంటే ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవడానికి మండలంలోని కొండ్రుపాడు చెరువు, కోటమ్మా చెరువు, కల్లంపల్లి చెరువు, రావెలకుంట చెరువు, కొనాయి కుంట తదితర పెద్ద చెరువులూ ఉన్నాయి. వీటి ద్వారా 13 వేల ఎకరాల ఆరుతడి పంటలకూ పుష్కలంగా నీరు అందేది. ప్రస్తుతం ఎత్తిపోతల పథకాలన్నీ మరమ్మతులకు లోనవగా, చెరువులు ఆక్రమణలకు గురై నీటి నిల్వలకు దూరమయ్యాయి. ఫలితంగా పొలాలు బీళ్లుగాను, పైర్లు ఎండు మెక్కలుగానూ మారుతున్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎత్తిపోతల పథకాల కింద పొలాల్లోని పైర్లన్నీ ఎండిపోతున్నాయి. యడవల్లి, మద్దిరాల, వేలూరులో గతంలో ఎత్తిపోతల పథకాల మీద ఆధారపడే మాగాణి సాగు చేసినా అవి మరమ్మతులకు గురవడంతో కొన్నేళ్లుగా మాగాణి సాగు నిలిపేశారు. చిలకలూరిపేటలో రెండు ఎత్తిపోతల పథకాలుండగా ఒంగోలు బ్రిడ్జికి సమీపంలోని పథకం కింద 2800 ఎకరాలు, పసుమర్రు పథకం కింద 3 వేల ఎకరాలు సాగయ్యేవి. ఇవి మూడేళ్లుగా పనిచేయడం లేదు. ఎత్తిపోతల పథకాలన్నీ పనిచేయకున్నా గతేడాది వరకూ వర్షాధారంగా రైతులు పంటలు సాగుచేస్తూ వచ్చారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం నేపథ్యంలో సమస్యలు తలెత్తాయి. ఎత్తిపోతల పథకాలకు నీరందించే నక్కవాగు, ఓగేరు వాగు, కుప్పగంజి వాగుల్లో నీరున్నా వాటిని ఎత్తిపోతల పథకాల ద్వారా పొలాలకు మళ్లించడం సాధ్యమవడం లేదు. యంత్రాలు పాడవడం, విద్యుత్‌ సరఫరాలో సమస్యలు, పైపుల లీకేజీ కారణంగా నాలుగేళ్ల నుండి ఎత్తిపోతల పథకాలేవీ పని చేయడం లేదు. చెరువుల నిర్వహణలో లోపాలూ నీటి నిల్వలను కుదించాయి. ఇవన్నీ రైతులకు శాపాలుగా మారాయి.
గతేడాది మిర్చికి మంచి ధర రావడం, సీజన్‌ తొలినాళ్లలో వర్షాలు పడడంతో మండలంలో 3 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేపట్టారు. మిర్చికి నెలకు కనీసం ఒకటి లేదా రెండు తడులు నీరు అవసరం. నవంబర్‌, డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరిలోనూ నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ పైరంతా ఇప్పుడు నీరందక ఎండుముఖం పట్టింది.
ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రారంభించే రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని చిలకలూరిపేట ప్రాంతంలో ప్రారంభించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి ఎత్తిపోతల పథకాల మరమ్మతులు విషయమై స్థానిక మంత్రి విన్నవించారు. నిధుల మంజూరుకూ ఆయన హామీనిచ్చినా ఇంకా అమలు కాలేదు. మరోవైపు మరమ్మతులు విషయమై ఇప్పటికే అధికారులకు పలుమార్లు అంచనాలు ఇచ్చామని, రూ.కోటి కేటాయిస్తే అన్నింటినీ వినియోగంలోకి తేవొచ్చని వైసిపికి చెందిన 15 వార్డు కౌన్సిలర్‌ జాలాది సుబ్బారావు చెబుతున్నారు.